అభివృద్ధి మరిచి మతాలు, దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనెందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ను తిరస్కరించి కర్ణాటక ప్రజలు బీజేపీ కి చెంపదెబ్బలాంటి తీర్పు ఇచ్చారని అన్నారు. బీజేపీ 40 శాతం కమీషన్ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతూ.. దేశ సంపద అంతా మోదీ దోస్త్ అదానీకి దారాదత్తం చేశాయని విమర్శించారు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తూ నీచాతినీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. 


ప్రజల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టి, దేశ భద్రతనే గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసమర్థ, అవినీతి పాలన వల్ల సిలిండర్ ధర, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అరిగోస పడుతున్నారని తెలిపారు. కర్ణాటక ప్రజలు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ప్రత్యామ్నాయ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో ఏదో పొడుస్తామని ఇక్కడి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నడని, అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు.


తెలంగాణలో కేసిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్ప.. ఇప్పటికే తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్, బీజేపీకి చోటు లేదని అన్నారు. దమ్ముంటే ముందు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపాలని మంత్రి వేముల సవాలు చేశారు. కర్ణాటక ప్రజలకు కొత్త ప్రభుత్వం ద్వారా మేలు కలగాలని, వారు కోరుకుంటున్న అభివృద్ది జరగాలని మంత్రి ఆకాంక్షించారు.