Telangana News:  మనుషులు బర్త్ డే  పార్టీలు చేసుకుంటారు. అలాగే తమకు ఇష్టమైన పెంపుడు జంతువులు ఉంటే వాటికీ బర్త్ డే పార్టీలు చేస్తారు.  కానీ మొక్కలకు బర్త్ డే పార్టీలు చేసే వారు అరుదుగా ఉంటారు.  తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆ కోవకే వస్తారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల కిందట ఇదే రోజున నాటిన మొక్కకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.       





            


నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కేంద్రంలో సరిగ్గా 8 సంవత్సరాల క్రితం ఈరోజు మొదటి విడత హరిత హారం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటారు. ఆ మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరం లోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.                                                           


ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరిత హారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయం అని వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణ లో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల 7.7 శాతం అడవులు పెరిగాయి అని తెలిపారు. మొక్కలు సంరక్షించడం నాటడం మన అందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు..మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు..


అభివృద్ధి, సంక్షేమంలో అగ్రపథంలో దూసుకెళ్లున్న తెలంగాణ రాష్ట్రం పచ్చదనంలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో చేపట్టిన హరితహారం కార్యక్రమం పుడమి తల్లికి పచ్చని కోకను బహమతిగా అందించినట్లయింది. నేడు పెరిగిన అటవీ విస్తీర్ణం..ఆకుపచ్చని అందాలతో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.