హైదరాబాద్: దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) పథకం గడువు మంగళవారంతో ముగిసింది. ఈ స్కీమ్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్-గ్రామీణ్ (VBG RAM-G) పథకం నేటి (జులై 1) నుంచి అమలులోకి రానుంది. ఈ నూతన పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.3,825.31 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటా కింద రూ.2,550.21 కోట్లను కేటాయించానుంది.
125కు పెరిగిన పనిదినాలు
పాత పథకం(MGNREGA)లో కొనసాగుతున్న మహిళా సంఘాల భవనాలు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, పాఠశాల గదుల వంటి నిర్మాణాలను పూర్తి చేయడానికి కేంద్రం అనుమతించగా, బుధవారం నుంచి చేపట్టే కొత్త పనులన్నీ జీరామ్జీ కిందే నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్, నూతన యాప్లను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. పాత పథకంలో 100 పనిదినాలు ఉండగా, ఈ కొత్త విధానంలో కూలీలకు 125 పనిదినాలు లభించనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుఈ నూతన పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేయడం తెలిసిందే. ఈ వీబీజీ రామ్జీ పథకంలో చేరాలా వద్దా అనే అంశంపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం రెండు సార్లు సమావేశమై పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గురువారం జరగబోయే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. జీరామ్జీ మార్గదర్శకాల్లోని 2 ప్రధాన నిబంధనలపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాత పద్ధతిలా కాకుండా కేంద్రం నిర్ణయించిన పనులనే చేయాలనడం, అలాగే వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులకు విరామం ఇవ్వాలనే నిబంధనల వల్ల కూలీలకు నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్రం ఈ నిబంధనలను సడలించకపోతే, రాష్ట్రంలో సొంతంగా ఒక ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.
కేంద్రానికి నివేదించిన వివరాలుతెలంగాణ ప్రభుత్వం ఈ పథకం అమలుపై ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ, కేంద్రం సూచనల మేరకు కొత్త బ్యాంక్ ఖాతా, ఆర్బీఐ (RBI) అకౌంట్ను ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో ముఖ గుర్తింపు విధానం అమలు చేస్తున్నట్లు, ఇప్పటివరకు 94.58 శాతం ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసినట్లు కేంద్రానికి స్పష్టం చేసింది.
