Minister Mallareddy : పాలమ్మిన... పూలమ్మిన... అంటూ ఎప్పుడూ జోకులు వేసే మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. కోపంతో ఒక్కసారిగా పైకి లేచిన మల్లారెడ్డి.. బీఆర్ఎస్ నేత చేతిలో మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. ఏదైనా ఉంటే కేసీఆర్ దగ్గర పరిష్కరించుకోవాలి కానీ సభావేదిక మాట్లాడతారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నిర్వహించారు. ఈ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీఅర్ఎస్ నాయకుడు సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో మంత్రి మల్లారెడ్డి ఆవేశానికి గురయ్యారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతుండగా మైకును లాక్కునేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు పార్టీకి సేవలందిస్తుంటే తమను ఏమాత్రం పట్డించుకోకుండా మా గొంతు కోశారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మాకు అన్యాయం జరిగిందని మా సీనియర్ నాయకులు, జిల్లా మంత్రి వర్యులు మల్లారెడ్డి పట్టించుకోవట్లేదని, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని సభా వేదికగా ఆయన ప్రశ్నించారు. దాంతో మల్లారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి మైకును లాగేసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సుధీర్ రెడ్డితో వాదించారు. వెంటనే కల్పించుకున్న  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సుధీర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డికి సర్దిచెప్పారు. సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి వద్ద పరిష్కారం చేసుకోవాలి కానీ ఇది వేదిక కాదన్నారు. 


కేటీఆర్ నోట మల్లారెడ్డి మాట


జవహర్ నగర్ ప్లాంట్ ప్రారంభోత్సంలో మంత్రి కేటీఆర్, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కేటీఆర్ మల్లారెడ్డి స్పీచ్ పై సరదాగా మాట్లాడారు.  తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఎంత సరదాగా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా అది వైరల్ అయిపోతోంది. కొద్ది నెలల క్రితం ఆయన మాట్లాడిన ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా.. బోర్ వెల్స్ నడిపించినా.. చిట్ ఫండ్స్ వేసినా.. కాలేజీలు పెట్టినా’ అని చేసిన వ్యాఖ్యలు విపరీతంగా జనాల్లోకి వెళ్లాయి. యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ లో ఎక్కడ చూసినా మల్లారెడ్డి మాటలే హల్ చల్ చేశాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను వివిధ సందర్భాల్లో పదే పదే మల్లారెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. దాంతో ఆయనకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది. తాజాగా మంత్రి కేటీఆర్‌ నోటి వెంట కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలు సరదాగా వచ్చాయి. అలా కేటీఆర్‌ కూడా కాసేపు నవ్వులు పూయించారు. మేడ్చల్‌ పరిధిలోని జవహర్‌ నగర్‌లో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన కలుషిత వ్యర్ధ జలాల శుద్ధి నిర్వహణ ప్లాంట్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మల్లారెడ్డి ప్రస్తావించారు. ఆయనకు సమాధానమిస్తూ.. ఇటీవల బాగా ట్రెండింగ్‌గా మారిన ‘పాలమ్మిన.. పూలమ్మిన..’ అనే మల్లారెడ్డి డైలాగ్‌ను చెప్పి కేటీఆర్‌ అందరినీ నవ్వించారు. ఆ సమయంలో సభకు వచ్చిన జనాలు అందరూ కేరింతలు కొట్టారు.


బర్రెలను కంట్రోల్ చేసినా సార్ 


‘‘ఇగ నేను మాట్లాడేదేమున్నది? మల్లన్నతో పెట్టుకుంటే గిట్లనే ఉంటది. మా మల్లన్న ఏం చెప్పిండు.. పాలు పిండినా..  అన్నావా లేదా (మల్లారెడ్డి వైపు చూస్తూ) కూరగాయాలు అమ్మినా.. ఇంకేం అమ్మినా అన్నావ్.. పూలు కూడా అమ్మినవ్. ఇంకా గమ్మత్తు ఏందంటే.. మొన్న శంకుస్థాపన దగ్గర జనాలంతా మీద పడుతుంటే మల్లన్న అందర్నీ నూకుతున్నడు. అరే గట్ల ఎందుకే పెద్ద మనిషివి నీకివన్నీ ఎందుకే అని అంటే.. చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్.. గిదేం లెక్కనా అన్నడు’’ అని కేటీఆర్ అనగానే అందరూ పగలబడి ఫక్కున నవ్వేశారు. అంటే కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డిగారు అన్ని రకాలుగా  ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఆయన కూడా ఒక ఆస్పత్రి కట్టారు కానీ ఎందుకో సరిగ్గా నడవలేదు. మల్లారెడ్డి కార్పొరేట్ సంస్థల నుంచి జవహర్ నగర్‌కు కూడా ఏదో ఒకటి చేయండి మరి’’ అని మల్లారెడ్డిని కేటీఆర్ కోరారు.