Majlis MLAs had a meeting with CM Revanth Reddy :  మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో సమావేశానికి వచ్చే ముందు  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు.


ప్రొటెం స్పీకర్ గా చాన్స్ ఇవ్వడంపై కాంగ్రెస్ విమర్శలు                  


ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ను ప్రభుత్వం ఎంపిక చేసుకోవడంపై  విమర్శలు వచ్చాయి. ఇతర సీనియర్లు ఉన్నప్పటికీ ఆయననే ఎంపిక చేసుకున్నారని  బీజేపీ నేతలు విమర్శించారు. అయితే ఇతర సీనియర్లు ఉన్నారు కానీ వారు పార్టీలు మారిన రికార్డు ఉన్న వారని అందుకే.. ఒకే పార్టీ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న అక్బరుద్దీన్ ను ఎంపిక చేశామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ ఉండటం వల్ల మజ్లిస్ తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కారణం ఏమైనప్పటికీ  అక్బరుద్దీన్ రెండు, మూడు రోజుల్లోనే తన ఎమ్మెల్యేలందరితో కలిసి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. 


అధికార పార్టీలతో సన్నిహితంగా ఉండటం మజ్లిస్ రాజకీయ విధానం                            


కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా మజ్లిస్ విబేధిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నిస్తోంది. పలు రాష్ట్రాల్లో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ముస్లిం ఓట్లను చీల్చి.. కాంగ్రెస్ ఓటమికి కారణం అవుతోంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మజ్లిస్ రాజకీయం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపింది. మజ్లిస్ కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. మిగతా అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు సాధించడానికి మజ్లిస్ మద్దతు కూడా ఓ కారణం అని భావిస్తున్నారు. 


బీఆర్ఎస్ కు దూరం జరిగి మజ్లిస్ కాంగ్రెస్‌కు దగ్గరవుతోందా ?                                      


అయితే మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ  పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలనుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత విషయాలు మర్చిపోయి.. మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ కంటే.. మూడు సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుకే్ మజ్లిస్ కు చెందిన ఏడుగురు బలం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.  నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు ఉంటారన్న సందేశం పంపితే చాలన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోంది.