KTR News: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉపాధి లేక ఉసురు తీసుకొంటున్నారని.. వారిని ఆదుకోవాలని అన్నారు. ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ 10 ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అని కేటీఆర్ విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. 


తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు చూస్తున్నామని.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభం మళ్లీ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిందని విమర్శించారు. గతంలో లబ్ధి పొందిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అన్నారు. కేవలం గత ప్రభుత్వంపై కక్షతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టవద్దని కోరారు.


మళ్లీ ఆకలి చావులే దిక్కు
‘‘కేవలం కేసీఅర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈరోజు ఈ పరిస్ధితి దాపురించింది. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపైన మీ అక్కసు వలన, వాటిని ఆపేడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదు. గత ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించాలని అనేక అందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లనే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు పని లేక మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొంది. ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక తనువు చాలిస్తున్నారు. 


ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలివీ..
ఖమ్మం జిల్లాకు చెందిన గుగ్గిల్ల నరేష్  (జనవరి,20), పెంటి వెంకన్న (మార్చ్ 17), సిరిసిల్లాకు చెందిన  తడక శ్రీనివాస్ (మార్చ్, 13), సిరిపురం లక్ష్మినారాయణ ( ఎప్రిల్ 7), ఈగ రాజు (ఏప్రిల్ 25 న), అడిచెర్ల సాయి (ఏప్రిల్ 26న), అంకారపు మల్లేషం (ఏప్రిల్ 26న), చింటోజు రమేష్ ( మే 23న), కుడిక్యాల నాగరాజు (జూన్ 22న), కరీంగనర్ కు చెందిన వెంకటేషం (జూన్ 16న) ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని అత్యంత బాధాతత్ప హృ‌దయంతో మీముందుకు తెస్తున్నాను. వెంటనే ఈ కుటుంబాలకు ప్రత్యేకంగా రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.  


ఉరిశాలగా సిరిసిల్ల
కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన  సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు  50 లక్షలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద నేతన్నలకు అండగా నిలిచారు. గత అరవై ఏండ్ల నేతన్నల దుఖం, బాధలపై పూర్తి అవగాహన ఉన్నందునే కేసిఅర్, బీఅర్ ఎస్ ప్రభుత్వం రాగానే చరిత్రలో ఎన్నడు లేనంతగా బడ్జెట్ ను పెంచి చేనేత, జౌళి శాఖద్వారా నేతన్నల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. సంక్షోభంలో చిక్కిన పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసిఆర్ గారు సమీక్ష నిర్వహించారు.


సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి  రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి.. పరిశ్రమను దెబ్బతీయడంతోపాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న మీ కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలి. మరణశయ్యపై మరమగ్గాల పరిశ్రమ ఉంది. దాన్ని వెంటనే ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం సబ్సిడీని వెంటనే అమలు చేయాలి.


గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉన్నది. లేకపోతే సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నేత కార్మికులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ వారి తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం’’ అని కేటీఆర్ లేఖలో డిమాండ్ చేశారు.