KTR strongly criticized  Revanth government: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ, కేంద్ర బడ్జెట్ ,  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో  విమర్శలు చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే  సెట్ విచారణలు, అరెస్టుల డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ వంటి తెలంగాణ రాష్ట్ర సాధకుడిని వేధిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పుతో చెలగాటం ఆడుతోందని హెచ్చరించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ చాలా అంశంపై స్పందించారు. 

Continues below advertisement

ఫోన్ ట్యాపింగ్ ఒక లొట్టపీసు కేసు

కేసీఆర్‌ను సుదీర్ఘంగా 4:30 గంటల పాటు విచారించడం కేవలం రాజకీయ పైశాచికానందం కోసమేనని కేటీఆర్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిరాధారమైన కేసు అని, ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఆదేశించరని స్పష్టం చేశారు. ఎవరి ఫోన్ ట్యాప్ అయిందో ఫిర్యాదులు ఎక్కడున్నాయి? ఏ యాక్టర్ ఫిర్యాదు చేశారు?  అని ప్రశ్నించారు. అధికారుల లీకులతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, ఆధారాలు ఉంటే కోర్టులో పెట్టాలని సజ్జనార్ వంటి అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Continues below advertisement

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేసీఆర్ విచారణకు ముందు, తర్వాత కూడా చర్చించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన కేంద్రం, రాష్ట్రానికి మాత్రం పైసా విదల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బయో ఫార్మాకు అడ్డా అయినప్పటికీ ఒక్క రూపాయి కేటాయించలేదు. రాష్ట్రంలో బిఆర్ఎస్ ఇప్పటికే మహిళా రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే, ఇప్పుడు కేంద్రం జిల్లాకో స్కూల్ అంటూ కొత్తగా చెబుతోంది.  రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ఉన్నా  , తెలంగాణ ప్రయోజనాల విషయంలో వారు సాధించింది  గుండు సున్నా ' అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు

ముఖ్యమంత్రి బామ్మర్ది బండారం బయటపెట్టామనే కోపంతోనే ప్రభుత్వం సిట్ విచారణలను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్  కుమారుడు బౌన్సర్లను పెట్టుకుని భూ దోపిడీ చేస్తున్నారని, దీనిపై కేసు నమోదు చేసిన సీఐని బదిలీ చేయడం ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని మండిపడ్డారు.  నల్లమల ద్వారా ఏపీ జల దోపిడీ చేస్తున్నా పట్టించుకోకుండా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తన  బాస్ కోసం తాకట్టు పెట్టారని విమర్శించారు.                                  

మేడారం జాతర వంటి కీలక సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం లేదని, భక్తుల ఆగ్రహం వల్ల మంత్రి వాహనం ధ్వంసం కావడమే దీనికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. అలాగే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ఒప్పందాలన్నారు కానీ, అందులో గ్రౌండ్ అయినవి ఎన్నని ప్రశ్నించారు. 7000 గ్రామాల్లో దిష్టిబొమ్మల దహనం ద్వారా ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కేటీఆర్ హితవు పలికారు.