Telangana News Today | యువత ఆకాంక్షలను విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె. తారక రామారావు (KTR) హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారు అనే అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని ఎద్దేవా చేశారు. 

Continues below advertisement

దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రధాని మోదీ గాలికొదిలేశారన్నారు. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలి కానీ మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని హితవు పలికారు. శనివారం ముంబైలో జరిగిన "ఎన్డీటీవీ యువ 2025 - ద ముంబై ఛాప్టర్ సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. జెన్ జెడ్ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర అంశాలపై మాట్లాడారు. 

డిజిటల్ మీడియాకు మాత్రమే జెన్ జెడ్ పరిమితం కావొద్దు..

Continues below advertisement

ప్రస్తుత యువతరం (Gen Z) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జెన్ జెడ్ శక్తిని తక్కువ అంచనా వేయద్దని పాలకులను ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచారని పేర్కొన్నారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందని, ఇదే జెన్-జీ పవర్ అన్నారు.  సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రావాలని.. రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, మీరే  రాజకీయాలను ఎందుకు నిర్ణయించలేరు? అని  యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

యువరక్తంతో ఉరకలేస్తున్న భారతదేశంప్రపంచం అంతా ముసలితనంలో ఉంటే భారత్ మాత్రం యవరక్తంతో ఉరకలెత్తుతోందన్నారు కేటీఆర్.  ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దాదాపు సమానమే. అప్పుడు చైనా తలసరి ఆదాయం 300 డాలర్లు అయితే మనది 500 డాలర్లు. కానీ 40 ఏళ్ల తర్వాత చూస్తే, ఇండియా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లు అయితే, చైనా 20 ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది. నేడు చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లకు చేరితే మనది కేవలం 2,700 డాలర్లే అన్నారు. చైనా అమెరికా, యూరప్‌లతో  పోటీపడితే, భారత్ మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పోల్చుకుని మురిసిపోతోంది"  అన్నారు.

అణుబాంబు దాడి జరిగినా జపాన్ ఎదిగింది..అణుబాంబు దాడితో నాశనమైన జపాన్, కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించింది. 1945లో హీరోషిమా, నాగసాకిలపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా ఆ దేశం కుంగిపోలేదు. ఎన్నో భౌగోళిక అననుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా తట్టుకుని అద్భుత ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణతో నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగింది. 

గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేటీఆర్ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉంది. ప్రపంచంలోనే అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (T Hub) హైదరాబాద్‌లో ఉంది. కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, భారత్‌లోని మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయాయని కేటీఆర్ ప్రశ్నించారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికా కంపెనీలకు సీఈవోలు అయితే సంతోషిస్తాం కానీ దేశంలో ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదని పట్టించుకోవడం లేదు. దేశంలోని 38 కోట్ల జెన్ జెడ్ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. 

తెలంగాణలో RRR పరిపాలనప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ (RRR) నడుస్తోందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌ను గెలిపించుకోనందుకు రిగ్రెట్ అవుతున్నారు. త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే (Revolt) అవకాశం ఉందన్నారు.