KTR Legal Notice to Revanth Reddy:   తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య సవాల్-ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది.  గ్లోబరీనా సంస్థ తన బినామీ కంపెనీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్, ఇప్పటికే రేవంత్‌కు పరువు నష్టం లీగల్ నోటీసు పంపినట్లు వెల్లడించారు. వరంగల్ పర్యటనలో భాగంగా విలేకరులతో నిర్వహించిన చిట్ చాట్‌లో మాట్లాడిన కేటీఆర్, గ్లోబరీనా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక ,  యాజమాన్య సంబంధాలు లేవని స్పష్టం చేస్తూ, దాన్ని రుజువు చేయకపోతే రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

గ్లోబరీనా వివాదంపై సవాలు విసిరిన కేటీఆర్, ఈ అంశంలో తాను ఎలాంటి సీఐడీ  విచారణకైనా, చివరికి లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని, దానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని డిమాండ్ చేశారు.  గ్లోబరీనా నిజంగానే నా బినామీ సంస్థ అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే సంస్థతో ఒప్పందాలు ఎందుకు చేసుకుంది  అని ప్రశ్నించిన ఆయన, సొంత ప్రభుత్వమే ఒప్పందం చేసుకుని తమపై బురద చల్లడం దారుణమన్నారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతూ  ఢిల్లీ లెవెల్ పొలిటికల్ అడ్జస్ట్‌మెంట్  చేస్తున్నారని, కేంద్రంలోని ప్రధాని మోదీ పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ విమర్శలకు అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. గత బీఆర్ఎస్ పాలనలోని లోపాలను వేలెత్తి చూపిన సీఎం రేవంత్, కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యల పరిపరిషత్ కోసం తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు. కేటీఆర్ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, తనకు రెండు ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలను నిరూపించగలరా అని ప్రశ్నించారు. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకున్నానని స్పష్టత ఇచ్చారు.

Continues below advertisement

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం తెచ్చిన  ఇందిరమ్మ ఇండ్లు  పథకంలో లబ్ధిదారులకు  5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేదలకు మేలు జరుగుతుందన్న అక్కసుతోనే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నీట్   పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందిస్తూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. 

ఇరు ప్రధాన నేతల మధ్య పోరు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్లోబరీనా ఆరోపణలపై లీగల్ నోటీసు పంపి కోర్టు దాకా వెళ్తామని కేటీఆర్ హెచ్చరిస్తుండగా, తమ సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికే బీఆర్ఎస్ నేతలు నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ అవినీతిపై సీఐడీ, సిట్   విచారణకు కేటీఆర్ విసిరిన సవాలును కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.