KTR Delhi Tour: ఎన్ని ప్రయాణాలు చేసినా వాటిలో కొన్ని మాత్రం చాలా సంతృప్తికరంగా జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి అనుభవమే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎదురైంది. ఆయన ఢిల్లీ పర్యటనకు ఓ విమానంలో వెళ్లగా.. ఓ యువతి రాసిచ్చిన లెటర్ ఆయన్ను ఎంతగానో ఆకట్టుకుంది.


‘‘ఈ రోజు సాయంత్రం నేను ఢిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు వినీల అనే ఈ యువతి నా దగ్గరకు వెళ్లి, నాతో ఫోటో దిగింది. ఇంకా ఓ పేపర్ నాప్కిన్‌పై ఆమె రాసిన ఈ నోట్‌ని నాకు అందజేసింది. ఆమె మంచి మాటలకు ధన్యవాదాలు. ఆమె భవిష్యత్తు బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇంకా ఆ యువతితో దిగిన ఫోటో, ఆమె టిష్యూ పేపర్ పై రాసిన లెటర్‌ను కూడా ఆ పోస్టుకు జతచేశారు.


ఆ లెటర్‌లో ఏముందంటే..
‘‘డియర్ కేటీఆర్ సర్.. మీతో కలిసి మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే నేను ఎంతగా స్ఫూర్తి పొందానో చెప్పలేను. నాకు రాజకీయాల గురించి తెలిసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మీరొక విజనరీ లీడర్. అదీకాక మీరు చాలా సింపుల్‌గా ఉండే ఒక సాధారణ మనిషి. భారత్‌కి మీలాంటి ప్రధాన మంత్రి ఉండాలని నేను ఎన్నో చోట్ల కామెంట్ చేశాను. ఫ్లైఓవర్లు, పట్టణీకరణ, ఫారిన్ పోర్ట్‌పోలియో ఇన్‌వెస్ట్‌మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్స్, టీ - హబ్, స్టార్టప్ కల్చర్ ఇలా చాలా విషయాల్లో మీరు చాలా అందుబాటులో ఉంటారు. ఇంకా ఎన్నో అంశాల్లో మీ లాంటి లీడర్ మా జనరేషన్‌లో ఉన్నందుకు చాలా సంతోషకరం. మాకు మీరు ఎన్నో మార్గాలను సుగమం చేశారు. తెలంగాణ తెచ్చినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ పట్ల మేం ఎంతో గర్వకారణంతో ఉంటాం’’ అని హైదరాబాద్ కు చెందిన యువతి వినీల ఓ టిష్యూ పేపర్‌పై రాసి కేటీఆర్ కు ఇచ్చారు.