KTR questions leaks in the phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సుమారు ఏడు గంటల పాటు జరిగిన ఈ విచారణలో తాను అధికారులకు పూర్తిగా సహకరించానని వెల్లడించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు  కాలక్షేప కథాచిత్రం నడుపుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తమ  పై బురద జల్లడమే లక్ష్యంగా ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

Continues below advertisement

ముఖ్యంగా సోషల్ మీడియాలో , కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరుగుతున్న హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్ సూటిగా స్పందించారు.  కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి వారిని బెదిరించినట్లు బయట విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఇది వాస్తవమా కాదా అని నేను సిట్ అధికారులనే నేరుగా అడిగాను. దానికి వారు అలాంటిదేమీ లేదని, అది వాస్తవం కాదని స్పష్టం చేశారు అని కేటీఆర్ వెల్లడించారు. కేవలం తమ వ్యక్తిత్వ హననానికి  పాల్పడటానికే ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రభుత్వం లీకుల రూపంలో వదులుతోందని ఆయన ధ్వజమెత్తారు.  తాను సిట్ అధికారులను బెదిరించినట్లుగా ప్రచారం చేశారని..కాంగ్రెస్ వాళ్లుక ఎలా తెలిసిందని ప్రశ్నించారు. 

విచారణ సమయంలో జరుగుతున్న లీకులపై  అధికారులను గట్టిగా నిలదీశానని కేటీఆర్ తెలిపారు.  విచారణ గదిలో ఉన్న అంశాలు బయటకు ఎలా వస్తున్నాయని, ఒకవేళ తానే లీకులు ఇచ్చానని అనుకుంటే.. తన ఎదురుగా ఉన్న అధికారుల ఫోన్లను కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాధాకిషన్ రావుతో తనను ముఖాముఖి కూర్చోబెట్టలేదని స్పష్టం చేశారు. విచారణలో తనతో పాటు ఏ రావు లేరన్నారు.   

చివరగా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాటాన్ని ఆపబోమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక, రైతుల సమస్యలను పరిష్కరించలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి కేసులతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. ఈ లీకులను, తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు ,  ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము చట్టానికి కట్టుబడి ఉంటామని, న్యాయస్థానాల్లోనే అన్ని విషయాలు తేలుతాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.