Revanth Reddy  : దేశంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులాల మధ్య, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు. 2009 కన్నా ముందు కొడంగల్ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించాలన్నారు.  రావులపల్లి,  మద్దూరు, కోయిల్ కొండకు డబుల్ రోడ్డు తీసుకొచ్చామన్నారు. కానీ కృష్ణా జలాలు తెస్తా అని చెప్పిన వాళ్లు, కనీసం దౌల్తాబాద్ చెరువు తూము మూతపడితే తట్టెడు మట్టి తీయలేదని ఆరోపించారు. 


హరీశ్ రావు..జూనియర్ కాలేజీ ఏమైంది? 


"ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు లేదో.. కాంగ్రెస్ ఆ ఊర్లో ఓటు అడగదు. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇవ్వలేదో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా అని నేను సవాల్ విసురుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప .. ఈ అయిదేళ్లలో కొడంగల్ కు మీరు చేసిందేంటి?. 119 నియోజకవర్గాల బీ ఫామ్ పై సంతకం పెట్టే అవకాశం సోనియా మనకు ఇచ్చారు. మన ఓటు మనం వేసుకుంటే.. ఎవరిదగ్గరా చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం ఉండదు. మన ఊర్లలో రైలు కూత వినిపించే బాధ్యత నేను తీసుకుంటా. నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్ కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను. ఏ ఒక్కరి దగ్గర చేయి చాచలేదు. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కానీ ఇప్పుడు కొడంగల్ లో పరిస్థితి మారింది. ఏ పంచాయతీ అయినా బీఆరెస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజీ తీసుకొస్తా అని హరీశ్ రావు అన్నారు, మరి ఇప్పుడు కాలేజీ ఎందుకు రాలేదు. " - రేవంత్ రెడ్డి


దౌల్తాబాద్ కు కృష్ణా జలాలు ఎప్పుడు? 


"కొడంగల్ ప్రజలు నాటిన మొక్క ఈ రేవంత్ రెడ్డి, ఇవాళ పెద్ద వృక్షమై తెలంగాణను రాజకీయాల్లో కీలకంగా మారింది.  కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఏం అభివృద్ధి చేశారు. రెండేళ్లలో దౌల్తాబాద్ కు కృష్ణా జలాలు తెచ్చి కొడంగల్ ప్రజల కాళ్లు కడిగి నెత్తిన జల్లుకుంటానన్న కేటీఆర్ ఎక్కడ. కనీసం దౌల్తాబాద్ చెరువు తూముకు రేకు అడ్డుపడితే దానిని కూడా తొలగించలేదు. దీంతో కింద వెయ్యి ఎకరాల పంట ఎండిపోయింది.  నియోజకవర్గంలో స్కూళ్లు, ఎమ్మార్వో ఆఫీస్, డబుల్ రోడ్డు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేయించాను. పోలీస్ స్టేషన్ లో పందులు పడుకునేవి. వాళ్లకు కూడా కొత్త పోలీస్ స్టేషన్ ఇప్పించాను. జూనియర్ కాలేజీ తెస్తామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటి వరకూ జూనియర్ కాలేజీ ఎందుకు ప్రారంభించలేదు. కేటీఆర్ కు నేను సవాల్ చేస్తున్నా... ఏ ఊర్లో ఇందిమ్మ ఇళ్లు అక్కడ కాంగ్రెస్ ఓట్లు అడగదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేని ఊళ్లలో మీరు ఓట్లు అడగకుండా ఉండగలరా?. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. కనీసం జూనియర్ కాలేజీ కట్టలేదు." - రేవంత్ రెడ్డి