తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం మహిళకు రిజర్వుడ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం స్థానం నిజంగా మహిళలకు రిజర్వ్ అయితే కనుక తాము తమ ఇంటి నుంచి మరెవరినీ నిలబెట్టబోమని స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథ పాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేటీఆర్ చెప్పినట్టుగా తన స్థానం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. మహిళల కోసం మనం వెనక్కి తగ్గాల్సి ఉంటుందని అన్నారు.


పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని తేల్చి చెప్పారు. మహిళల కోసం తాము అందరం ముందు ఉండాలని.. కేటీఆర్ చెప్పినట్లు తన స్థానం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, తాను ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేయడం మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు. తాను ఖమ్మం నియోజకవర్గాన్ని వదిలిపెట్టబోనని అన్నారు. 


దండాలు పెట్టి మళ్లీ మాయమైపోయే వారికి దూరంగా ఉండాలని తెలిపారు. గతంలో ఇక్కడ గెలిపించిన ఎవ్వరైనా సరే రెండో సారి ఖమ్మంలో ఉండే ప్రయత్నం చేయలేదు. ఎవరినీ గెలిపించినా అటు ఇటో చూసి పారిపోయారని అన్నారు. కానీ, తాను మాత్రం ఇక్కడే ఉన్నానని చెప్పారు. కొంత మంది ఎన్నికలు అయిపోతే మాయమైపోతారని.. నిత్యం మీ వెంట ఉండేది తాను మాత్రమే అని అన్నారు. మూడోసారి తనను గెలిపించుకొని మళ్లీ ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుతున్నానని అన్నారు.