KCR and Harish Rao files petitions in High Court: కాళేశ్వరం నివేదిక పూర్తిగా చట్ట విరుద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కమిషన్ వేసిందని.. ఆ కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలో కమిషన్ నియమించారు. జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ తన పని పూర్తి చేసి, 665 పేజీల నివేదికను జులై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణ లోపాలకు కారణం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అని తేల్చినట్లుగా తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి పూర్తి స్థాయిలో చర్చించి ఏం చర్యలు తీసుకోవాలో అసెంబ్లీనే డిసైడ్ చేస్తుందని సీఎం రేవంత్ చెప్పారు.
అయితే ఈ రిపోర్టు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికేనని కేసీఆర్ భావిస్తున్నారు. రిపోర్టు ఇచ్చినప్పటి నుండి ఫామ్ హౌస్లో పార్టీ ముఖ్య నేతలతో, న్యాయ నిపుణులతో సుదీర్ఘ మంతనాలు నిర్వహించారు. ఈ రిపోర్టులో ఉన్న తీవ్రతను బట్టి కేసీఆర్ , హరీష్ రావు కేసులను, అరెస్టు వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఓ అంచనాకు వచ్చారు. వీటిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని అనుకున్నప్పటికీ న్యాయనిపుణుల సూచనల మేరకు ముందుగా.. హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసే దాడులను ఎదుర్కోవడానికి కేసీఆర్ కొద్ది రోజులుగా కేటీఆర్, హరీశ్ రావు, జగదీష్ రెడ్డి వంటి ముఖ్య నేతలు సమావేశమవుతూ వస్తున్నారు. నివేదిక తర్వాత పరిణామాలను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఇది భాగమని చెప్పేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. . పి.సి. ఘోష్ కమిషన్ నివేదిక ఆలస్యం అవ్వడం, అది స్థానిక సంస్థల ఎన్నికల ముందే బయటపెట్టడం ఇవన్నీ కాంగ్రెస్-బీజేపీ సంయుక్త కుట్రగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
నిజానికి అసెంబ్లీలో పూర్తి స్థాయి నివేదిక పెట్టిన తర్వాత చర్చల్లోనే చీల్చిచెండాడాలని అనుకున్నారు కానీ.. దాని వల్ల ఆ నివేదికకు చట్టబద్ధత అంగీకరించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ముందుగానే న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. అయితే ఈ అంశంలో.. కేసీఆర్ ను అరెస్టు చేసే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో చెప్పారు. కేసీఆర్ ను ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష అన్నారు. ఆయన జైల్లో ఉన్నా.. ఫామ్ హౌస్ లో ఉన్నా ఒకటేనన్నారు. కేసీఆర్ కు అరెస్టు ముప్పులేదని సీఎం చెప్పినప్పటికీ .. అది రేవంత్ రాజకీయమని.. తర్వాత అరెస్టు చేసి తన ప్రమేయం లేదని చెప్పుకోవడానికి ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు.