Kavitha :   కేసీఆర్​ అంటే అందరూ కల్వకుంట్ల చంద్రశేఖర్​అనేవారని ఇప్పుడు కాళేశ్వరం చంద్రశేఖర్​ అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.  ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్ట్​గా కాళేశ్వరం ఘనతకెక్కిందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.   కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా ప్రాజెక్టుకి నిధులు, జాతీయ హోదా ఇవ్వక పోవడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెస్​ పాలనలో కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకునే వారని అలాంటి వ్యక్తులు కాళేశ్వరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ నిజామాబాద్​లో సాగునీటి దినోత్సవం జరిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవిత హాజరయ్యారు. 


దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు నీటిని అందించలేకపోయిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పదేళ్లలో బీఆర్​ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్​ తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరని, కాంగ్రెస్​ హయాంలో  జరిగిన అభివృద్ధి ఏంటో ఆ పార్టీ నాయకులు చెప్పాలన్నారు.  ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్  అని  స్పష్ట చేశారు.  కేసీఆర్‌ అంటే కాలువలు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. 
 
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పనిచేశారు. కానీ అప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా నీటిపారుదల రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. పారదర్శక పాలన ఉంది కాబట్టే 21 రోజులపాటు ప్రతీ శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా నాకు తెలుసునని వెల్లడించారు.
 
కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతున్నది నిజామాబాద్  జిల్లాయేనని తెలిపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడిదుంకుతున్నాయంటే దాని వెనుక కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం అని తెలిపారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా లక్ష 80 వేల ఎకరాలకు సాగునీరు అందించుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఇంజినీర్‌ల సంఖ్యను పెంచుకొని.. ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలను పటిష్ట పర్చుకున్నామని చెప్పారు. అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.