ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ విషయమైన రాజకీయంగా కాక రేపుతుంది. ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. 
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని కాంగ్రెస్ నేతల మాట. అందుకే సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నట్టు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రేవంత్‌ రెడ్డి 4+4 భద్రతను ప్రభుత్వం కల్పించింది. అయితే వాటిని ఈ మధ్యనే 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారని చెబుతున్నారు. 


ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను ప్రభుతం తొలగించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై ముందు నుంచి ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. 


అధికార పార్టీకి చెందిన వారి వెర్షన్ వేరేలా ఉంది. మొన్నీ మధ్య పోలీసులపై ఆయన చేసిన కామెంట్స్ కారణంగానే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. సెక్యూరిటీ స్టాఫ్ ఆయన వద్ద పని చేసేందుకు నిరాకరించారని చెబుతున్నారు. పోలీసుల గుడ్డలు ఊడతీస్తానాన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కారణంగానే తాము విధులకు హాజరుకాబోమని గన్‌మెన్‌లు చెప్పారని పుకార్లు వినిపిస్తున్నాయి. బుధవారం నుంచి ఆయనకు భద్రతగా గన్‌మెన్‌లు వెళ్లలేదని రేవంత్‌ సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇంతకీ రేవంత్ ఏమన్నారు కేసులు ఎందుకు రిజిస్టర్ అయ్యాయి 


పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాలతో నాగర్ కర్నూల్ పీఎస్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ పై 153, 504, 506, 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 


మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం అని.. 100 రోజుల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి కొడతాం, అసలు మిత్తి (వడ్డీ)తో సహా చెల్లిస్తాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


దీనిపైనే జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ సీరియస్ అయ్యారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. విమర్శలతో ఆగని ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.