Korutla Deepthi Case: జగిత్యాల జిల్లా కోరుట్లలో టెకీ దీప్తి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మద్యం సేవించడం, ఆపై దీప్తిని హత్య చేయడం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మంగళవారం రాత్రి దీప్తి అనుమానాస్పద మృతి వెలుగు చూడగా.. దీప్తి ఎలా చనిపోయింది, తను చనిపోవడానికి కారణం ఏంటి, ఎవరైనా హత్య చేశారా, చేస్తే వాళ్లు ఎవరూ అనే విషయాల గురించి పోలీసులు ఇప్పటికీ ఏదీ తేల్చలేకపోతున్నారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న దీప్తి చెల్లెలు చందనను, చందన ప్రియుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చందనన, ఆమె ప్రియుడు కలిసి ఆ రాత్రి ఇంట్లో మద్యం పార్టీ అనంతరం వెళ్లిపోవడంతో పలు అనుమానాలు నెలకొన్నాయి.


దీప్తి మృతి కేసులో పోస్టు మార్టమ్ రిపోర్టు కీలకం కానుందని పోలీసులు చెబుతున్నారు. ఈ రోజు వైద్యులు ఇచ్చే పోస్టు మార్టం నివేదికలో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి. దీప్తిని తాను చంపలేదని చందన తమ్ముడు సాయికి వాయిస్ మెసేజ్ పంపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే కోరుట్ల బస్టాండ్ లో సీసీ కెమెరా ఫుటేజ్ చందన, ఆమె ప్రియుడిది కాదని పోలీసులు తేల్చారు. వాయిస్ మెసేజ్ పంపడంతో సాంకేతికత ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 


ఇదీ జరిగింది..


ఏపీకి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు. వీరు 25 ఏళ్ల క్రితమే కోరుట్లకు వచ్చి భీముని దుబ్బలో స్థిరపడ్డారు. ఇటుక బట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాసరెడ్డి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు 24 ఏళ్ల దీప్తి పుణెలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అలాగే చిన్న కూతురు చందన ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది.


సోమవారం రోజు ఉదయం శ్రీనివాస్ రెడ్డి, మాధవి హైదరాబాద్ లోని బంధువుల గృహ ప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా... దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు అక్కాచెల్లెల్లు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో చిన్న కూతురు చందన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. రెండు మూడు సార్లు ఫోన్ చేసిన ఆయన.. ఎవరూ స్పందించకపోవడంతో భయపడిపోయారు. 


Also Read: Modi Charishma: ఏమాత్రం తగ్గని మోదీ ఛరిష్మా, ప్రతి 10 మందిలో 8 మంది ఆయన వైపే - తేల్చి చెప్పిన రీసెర్చ్


పక్కింటి వాళ్లకు ఫోన్ చేసి తమ ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పక్కింటి మహిళ.. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది. తలుపులు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉండగా పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా... పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. అది చూసి భయపడిన మహిళ స్థానికులను పిలిచింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే దీప్తి చనిపోయినట్లు గుర్తించారు. 


ఇదే విషయాన్ని మృతురాలి తండ్రి శ్రీనివాస్ తోపాటు పోలీసులకు తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీఐ లక్ష్మీ నారాయణ, ఎస్సై కిరణ్, చిరంజీవి హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వంటగదిలో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్కాచెల్లెల్లు అర్ధరాత్రి మద్యం సేవించి ఉంటారేమో అని పోలీసులు భావిస్తున్నారు.