Kamareddy Master Plan Cancel :  కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతున్న కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశానికి ప్రభుత్వం ముగింపు పలికింది. ఈ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం  ముస్నిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేయాలని రైతులు ఒత్తిడి చేస్తూండటంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. దీంతో అందరూ రాజీనామా చేసే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తున్నారు.


 



కామారెడ్డి పట్టణానికి మున్సిపల్ అధికారులు ఓ మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపొందించారు. దానిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు పోతున్నాయన్న ఆందోళనతో  8 గ్రామాల రైతులు ఉద్యమం ప్రారంభించారు. డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ను 2022 నవంబర్​ చివరిలో ప్రకటించారు. ఇందులో చూపెట్టిన ఇండస్ర్టియల్​ జోన్​, గ్రీన్​ జోన్, రీక్రియేషన్​ జోన్​, 100 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్ల ప్రతిపాదనలపై ఆయా గ్రామాలకు చెందిన రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.  కామారెడ్డి మున్సిపాల్టీ పరిధిలోని అడ్లూర్​, ఇల్చిపూర్, టెకిర్యాల్​, లింగాపూర్​, పాతరాజంపేట, రామేశ్వర్​పల్లిలో పాటు సదాశివనగర్​ మండలం అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన  రైతులంతా రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడ్డారు.


రైతులు వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.    రైతుల ఉద్యమానికి రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. భూములు పోతాయన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. మరో రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.  ఇటీవల జిల్లా కేంద్రంలో రైతుల భారీ ర్యాలీ,  కలెక్టరేట్ ఎదుట ధర్నా, జిల్లా కేంద్రం బంద్​  పోగ్రాములు సక్సెస్​ అయ్యాయి. దీంతో  రైతుల ఉద్యమం రాష్ర్ట వ్యాప్తంగా చర్చగా మారింది. దీంతో అధికార పార్టీపై ముఖ్యంగా స్థానిక లీడర్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 


మున్సిపాల్టీలో విలీనమైన లింగాపూర్, టెకిర్యాల్, అడ్లూర్​, రామేశ్వర్​పల్లి, ఇల్చిపూర్, పాతరాజంపేట గ్రామాలతో పాటు, సదాశివనగర్​ లో  బీఆర్​ఎస్ కు  పట్టుంది. కానీ,  మాస్టర్​ ప్లాన్​పై  ఈ గ్రామాల  నుంచే వ్యతిరేకత రావడంతో బీఆర్​ఎస్​ నాయకులు ఇరకాటంలో పడ్డట్టైంది. మాస్టర్​ ప్లాన్​ను కంప్లీట్​గా రద్దు చేయించేందుకు ఒత్తిడి తెచ్చేందుకు కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. అలాగే  ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తామని ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్​తో  సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రామాలకు  వెళ్లి  నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ  రైతులు ససేమిరా అన్నారు.  ఏ రైతుకు కూడా నష్టం జరగకుండా మాస్టర్​ ప్లాన్​ను మారుస్తామని, డీటీసీపీ, కన్సల్టెన్సీ తప్పిదంతో మాస్టర్​ ప్లాన్​ వివాదానికి కారణమైందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ రైతులు అంగీకరించలేదు. 


రైతులు మున్సిపల్ కౌన్సిలర్ల రాజీనామాలకు పట్టుబట్టారు. చివరికి పరిస్థితి దిగజారుతోందని అంచనా వేసిన ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ రద్దుకు నిర్ణయం తీసుకుంది.