కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) గ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగింది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారులోని బీ బ్లాకులో 18, 19, 20, 21 పిల్లల మధ్య ఉన్న వంతెన శనివారం రాత్రి భారీ శబ్దంతో ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20 ఫిల్లర్ కుంగడంతోనే పైన వంతెన దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 


అధికారులు అప్రమత్తం


బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ క్రమంలో భారీ శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్య నిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోను మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. 


16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన పొంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తర్వాత వాటిని 46 పెంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేర జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.


రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన పొంగడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భారీ శబ్దం నేపథ్యంలో డ్యాం ఇంజనీరు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహాదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎల్ అండ్ టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని ఈఈ తిరుపతిరావు పరిశీలించారు.