Kumari Aunty Food in Hyderabad: ఆమె ఒక స్ట్రీట్ వెండర్. పదేళ్లుగా ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ ఆమె కుటుంబం జీవనం సాగిస్తూ ఉంది. ఆమె వంటకాలతో వడ్డించే భోజనానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ మహిళ కష్టపడుతున్న తీరు, ఆహారం ఈ మధ్య మరీ ఫేమస్ అయ్యాయి. అదే యూట్యూబర్లను ఆకర్షించింది. ఫుట్ పాత్ పై ఓ చిన్న పాకలో ఆమె భోజనం వడ్డిస్తున్న తీరు, వచ్చిన వారిని మర్యాదగా సంబోధించే విధానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అంతే.. ఆమె కొద్ది రోజుల్లోనే విపరీతంగా ఫేమస్ అయిపోయారు. తర్వాత ట్రోల్స్ కు కూడా గురయ్యారు. ఆ తర్వాత ఆ ట్రోల్స్ తప్పుడువని.. నెటిజన్లు అర్థం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అదే ఇప్పుడు ఆమె వ్యాపారానికి అడ్డంకిగా మారింది. ఆమెను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు వాడుకోవడం కూడా మొదలైపోయింది.


దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కనున్న రోడ్‌లో మధ్యాహ్నం వేళ ఓ పాక వద్ద విపరీతమైన జనం కనిపిస్తారు. ఫుట్ పాత్‌పైన మధ్యాహ్న భోజనం తినడం కోసం కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఆఫీసర్ల వరకూ ఆ పాక వద్ద క్యూ కడుతుంటారు. అంతగా ఆదరణ పొందిన ఆ స్ట్రీట్ వెండర్ పేరు దాసరి సాయి కుమారి. కుమారి ఆంటీగా అందరికీ సుపరిచితం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికి ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. కొద్ది వారాలుగా సోషల్ మీడియాలో ఆమె ట్రోలింగ్స్ కు గురై.. తర్వాత దాని వెనక అసలు నిజాల్ని జనం తెలుసుకున్నారు. 


ఆ క్లిప్పింగ్ తో ట్రోల్స్
రెండు లివర్ లు రూ.1000 బిల్ అయిందంటూ.. ఒక క్లిప్ ను విపరీతంగా వైరల్ చేయడంతో.. ట్రోలింగ్ కు గురయ్యారు. ఆ తర్వాత దాని వెనక అసలు ఏం జరిగిందనేదానిపై దాసరి సాయికుమారి క్లారిటీ ఇచ్చారు. దీంతో మళ్లీ ఆమెపై జనాల్లో సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రోజురోజుకూ ఆమె వద్ద భోజనం కోసం జనాలు పెరిగిపోవడం ఎక్కువైపోయింది. అన్నం తినడానికి వచ్చిన వారు వారి వాహనాలను రోడ్డుపై ఎక్కడికక్కడ పార్క్ చేస్తుండడంతో పోలీసులు ఆమె వ్యాపారాన్ని మూయించారు.


తెలియక నోరు జారిన కుమారి ఆంటీ
ఓ ఇంటర్వ్యూలో కుమారి ఆంటీ మాట్లాడుతూ.. తమకు ఆస్తులు ఏమీ లేవని, ఊళ్లో జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రం ఉందని నోరు జారారు. ఇది మరో సమస్యను రేకెత్తించింది. ఆ క్లిప్‌ను వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం వాడేసుకొని.. ‘‘సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్తే.. వెటకారం చేసిన పెత్తందారులకి దిమ్మతిరిగిపోయేలా దాసరి సాయి కుమారి చేశారు. ఆమెకు తనకంటూ ఆస్తి ఉందంటే.. అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది’’ అని ఒక పోస్ట్ చేసింది. 






అడ్డుకున్న పోలీసులు
ఇంతలో హైదరాబాద్ పోలీసులు మంగళవారం (జనవరి 30) మధ్యాహ్నం సాయి కుమారి వ్యాపారాన్ని అడ్డుకున్నారు. అక్కడ జనాలు ఎక్కువైపోయి.. తమ వాహనాలను రోడ్డుపై ఎక్కడికక్కడ పార్క్ చేస్తుండడం.. ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుండడం వల్ల పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. రోజులాగే ఆటోలో ఆహార పదార్థాలను తీసుకు రాగా.. పోలీసులు వాటిని కిందికి దింపనివ్వలేదు. దీంతో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే తనను ఫేమస్ చేశారని.. అదే తనకు శాపంగా మారిందని వాపోయారు. 


రాజకీయాల్లోకి లాగిన వైసీపీ
ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ సీపీ మరో పోస్ట్ కూడా చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయాలతో ముడిపెట్టింది. ‘‘మొత్తానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరికీ సీఎం జగన్ పేరు వింటేనే వణుకు పుడుతోంది. అందుకే జగనన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు ఈ దత్త తండ్రి కొడుకులు ఉసిగొల్పారు. జగనన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు’’ అని మరో పోస్ట్ చేసింది. 






ఇలా దాసరి సాయి కుమారి తన మానాన తాను వీధి పక్కన వ్యాపారం చేసుకుంటుంటే.. తన ప్రమేయం లేకుండానే ఫేమస్ అయ్యారు. చివరికి ఆమె ఇంటర్వ్యూలను రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వాడుతున్న తీరు కనిపిస్తోంది.