YS Sharmila Invites Pavan Kalyan to Her Son's Wedding: హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అటు రాజకీయ, ఇటు వ్యక్తిగత కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో వైఎస్ షర్మిల కలిశారు. త్వరలో జరగనున్న తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి జనసేనానిని ఆమె ఆహ్వానించారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కు అందించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై షర్మిల, పవన్ కొంతసేపు చర్చించారు. షర్మిల తనయుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహానికి ముహూర్తం నిశ్చయించారు.




ప్రముఖులకు వైఎస్ షర్మిల వరుస ఆహ్వానాలు
ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. గత కొన్ని రోజుల నుంచి షర్మిల పలువురు రాజకీయ, ఇతర ప్రముఖులతో వరుస భేటీ అవుతున్నారు. తన కుమారుడు రాజా రెడ్డి వివాహానికి ఆహ్వానాలు అందిస్తున్నారు. మొదట తాడేపల్లికి వెళ్లిన షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కు వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తమ ఇంట్లో జరగనున్న శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ఆమె పవన్ కుటుంబసభ్యులను రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించారు.