పవన్‌ కల్యాణ్‌ ఇంటి ఎదుట ఓ మహిళ నానా హంగామా చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 35లో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇల్లు ఉంది. తొలుత రోడ్ నెంబరు 35లోకి వచ్చిన మహిళ పవన్ ఇంటి ఎదుటకు వచ్చింది. ఆమె అనుమానాస్పదంగా అక్కడే సంచరిస్తుండడంతో సెక్యురిటీ సిబ్బంది ప్రశ్నించగా తాను పవన్‌ కల్యాణ్‌ను కలవాలని చెప్పింది. కుదరదు వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడున్న సెక్యూరిటీతో గొడవకు దిగింది. ఈ ఘటన గురువారం (జనవరి 6) ఉదయం జరిగింది.


సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి పంపించకపోవడంతో మహిళ వాగ్వాదం పెట్టుకుంది. రాళ్లతో చుట్టుపక్కల వారిని కొడుతూ హంగామా చేసింది. అప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో.. ఆమె తన ఒంటిపై దుస్తులు తీసేసి అటూ ఇటూ తిరుగుతూ వీరంగం చేసింది. ఈ విషయాన్ని ఒక స్థానికుడైన హసన్‌ అలీ అనే వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకున్నారు. 


అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆ మహిళ గురించి ఆరా తీయగా ఆమె తమిళనాడు రాష్ట్రంలోని మధురై వైఓత్తకాడై ప్రాంతానికి చెందిన జాయిస్‌ కమల అనే 36 మహిళగా తేలింది. గతంలో కూడా ఆమె హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఇంటి ముందు ఇలాగే హంగామా చేసిందని, దీంతో తాము పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా ఈమె గతంలో కూడా సినీ హీరోల ఇంటి వద్ద తిరుగుతూ వీరంగం చేసిందని పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.