K Kavitha:తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ అసెంబ్లీ నుంచి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన బిల్లులను త్వరగా ఆమోదించేలా చొరువ తీసుకోవాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలేకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి అథవాలే ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేస్తున్న బీసీ ఉద్యమం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించారు. అదే సమయంలో బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించడానికి చొరువ తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు కవిత.
ఏళ్లతరబడి సమాజ నిర్మాణంలో నాగరికత వికాసంలో బహుజనుల పాత్ర అత్యంత కీలకమైనదని, అదే సమయంలో స్థానిక సంస్థల్లో ఆ వర్గాల ప్రాతినిధ్యం వారి జనాభా ప్రాతిపదికన లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సమాన అవకాశాల కోసం ఓబీసీలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారని, అందులో తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదని తెలంగాణ జాగృతి బలంగా విశ్వసిస్తోందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని కేంద్రమంత్రికి వివరించారు కవిత.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసన సభ, శాసన మండలిలో రెండు వేర్వురు బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదానికి పంపించిందని గుర్తు చేశారు. బీసి రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించి చాలా కాలం గడుస్తున్నప్పటికీ ఇంకా ఆమోదముద్ర పడని విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన కవిత, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడానికి చొరువ తీసుకోవాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను కోరారు.ఇప్పటికే జూన్ 17వ తేదిన రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత, తాజాగా కేంద్రమంత్రి చొరవతో ఢిల్లీలో సైతం బీసీ బిల్లుపై చర్చకు తెరలేపనుంది.