Prahlad Joshi: ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ప్రవాసీ యోజనలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పక్కా కుటుంబ పార్టీ అని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఎనిమిది ఏళ్లలో తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్.. నిరుద్యోగులను మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. మానిఫెస్టోలో చెప్పిన నిరుద్యోగ భృతి సంగతి ఏమి అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కేంద్ర మంత్రి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేదని ప్రహ్లాద్ జోషి విమర్శలు గుప్పించారు. 


'ఎన్ని డబుల్ బెడ్రూములిచ్చారో చెప్పాలి'


కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడుస్తున్నా.. హైదరాబాద్ లోని పాత బస్తీలో మెట్రో పూర్తి చేయలేకపోయారని కేంద్ర మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పీఎంఏవై నిధులను పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన  అమలు కావడం లేదని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


'తెలంగాణలో కుటుంబ పాలన'


సబ్ కా సత్ సబ్ కా వికాస్, ఈ అంశాలు భారదేశంలో ప్రఖ్యాతి గాంచాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. 2 కోట్లకుపైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కొనియాడారు. కోవిడ్ మహమ్మారిని నివారించడంలో, ఆర్థికంగా పుంజుకోవడంతో భారత దేశం ముందంజలో ఉందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ది పొందుతున్నారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన పథకాలను తెలంగాణలో మాత్రమే అమలు పరచడం లేదని ఆరోపించారు. ప్రధాన మంత్రి మోదీ కి భారత దేశం అంత ఒక కుటుంబమని కొనియాడారు. 


తెలంగాణ లో ఒక కుటుంబ పాలన నడుస్తుందని విమర్శించారు. 85 శాతం కేంద్రం సబ్సిడీ కింద బియ్యం అందిస్తుందని.. 15 శాతం రాష్ట్రం ఇస్తుందని తెలిపారు. ఇరిగేషన్ కాళేశ్వరం మొదట 40 వేల కోట్లతో ప్రారంభించి ఇప్పుడు లక్షా 20 కోట్లకు మార్చారని కేంద్ర మంత్రి విమర్శించారు. అవాస్ యోజన కింద కేంద్రం అందిస్తున్న వాటిని రాష్ట్రం అమలు పరచడం లేదని ప్రహ్లాద్ జోషి విమర్శించారు. అందులో డబల్ బెడ్రూం ఇళ్లను ఇప్పటికే 2 లక్షలు ఇచ్చిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. సీఐజీ రిపోర్ట్ మీద కేసీఅర్ ఎందుకు స్పందించడం లేదని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. 


3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలని కేసీఆర్ ను నిలదీశారు. నిరుపేదలకు ఎంత మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన కింద కేంద్రం రైతులకు అండగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. ఆయుష్ మాన్ భారత్, రైల్వే ప్రజా రవాణాకు ఎంతో సౌకర్యాలు కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 85 కోట్లు రైల్వే రవాణాకు ఖర్చు చేస్తుందని వివరించారు. 2050 కోట్లు 2021 లో ఖర్చు చేసిందని.. కేంద్రం 2022 లో 3000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.