ఏబీపీ నెట్‌వర్క్ ఎంతో ప్రతిష్టాత్మంగా హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2024 అద్భుతమైన సన్నివేశానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ సహా వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 


సమ్మిట్ జరుగుతున్న టైంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అనూహ్యంగా కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చాలా కాలం తర్వాత ఇలా కలుసుకున్నామంటూ బాగోగులు తెలుసుకున్నారు. 


ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ 2024లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అతి చిన్న వయసులోనే కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే కాకుండా కీలకమైన విమానాయన శాఖను అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై ఆయన సమ్మిట్‌లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న టైంలోనే సమ్మిట్‌కు కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంలో ఒకరినొకరు ఎదురు పడ్డారు. పలకరించుకున్నారు. 






కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడికి కేటీఆర్‌ కంగ్రాట్యులేషన్ చెప్పారు. అనుకోకుండా కలుసుకున్నామని... చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నామంటూ విష్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.


ఇద్దరు రామ్‌లు కలుసుకున్న టైంలోనే అక్కడకు సీనియర్ నటులు గౌతమి, ప్రకాష్ రాజు వచ్చారు. కేంద్రమంత్రి రామ్‌ను, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను పలకరించారు. నలుగురు కాసేపు మాట్లాడుకున్నారు.