Betting Apps Promotion: తెలంగాణలో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్ కేసు, విచారణ తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెలబ్రిటీలపై కేసులు పెట్టారు.  ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో బెట్టింగ్ యాప్స్ ప్రొమోట్ చేసిన ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్‌రాజ్, మంచు లక్ష్మీతోపాటు 25మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారంలో హర్షసాయి, విష్ణుప్రియ, లోకల్ బాయ్ నాని ఇలా 11మందిపై కేసు నమోదు చేశారు. 

అటు పంజాగుట్ట, ఇటు మియాపూర్ పోలీస్టేషన్‌లో సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్స్‌పై బెట్టింగ్ ప్రమోషన్ వ్యవహారంలో వరుస కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను విచారించారు. తాజాగా వైసీపీ నేత శ్వామలను బెట్టింగ్ ప్రమోషన్ కేసులో ప్రశ్నించారు. సినీ హీరోలు సైతం విచారణకు హాజరవుతారు. 

ఈ విచారణ సాగుతున్న టైంలో ప్రముఖ హీరో బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. వీళ్లపై కూడా కేసులు పెట్టాలని ఫిర్యాదులు అందుతున్నాయి. వీళ్లు గతంలో ప్రమోట్ చేసిన వీడియో ఆధారాలు బయటపెట్టారు. ఇలాంటివి చేయడంతోనే ఈ మాటలు నమ్మిన ప్రజలు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న వారు చాలా మందే ఉంటున్నారు. మరికొందరు అప్పుల పాలై ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా బెట్టింగ్ మహమ్మారికి బానిసలుగా మారిపోయారు. 

ఇలా లిస్ట్ చాలా పెద్దదిగా మారుతోంది. ఇంకేంత మంది త్వరలో సినీ హీరోలు సైతం విచారణకు హారవుతారు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారి విచారణ సాగుతోంది. ఈ విషయంలో కొందరి అరెస్ట్‌లు తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసు అనూహ్య మలుపు తిరిగింది. బెట్టింగ్ యాప్ కేసుల్లో సెలబ్రిటీలు సేఫ్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

బెట్టింగ్ కేసు విచారణలో పోలీసులు రూటు మార్చినట్లు సమాచారం అందుతోంది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, బెట్టింగ్ యాప్ కంపెనీలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.  వారిని ప్రధాన నిందితులుగా చేర్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే 19 బెట్టంగ్ యాప్‌లను గుర్తించారు. ఆ యాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇకపై బెట్టిగ్ యాప్ కంపెనీలపైనే చర్యలుంటాయట. 

లింక్‌ డౌన్‌లోడ్ చేసుకోండి, ఆడండి.. లక్షలు గెలుచుకోండి అంటూ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన, విపరీతంగా ప్రచారం కల్పించి సెలబ్రిటీలు మాత్రం ఈ కేసులు కేవలం సాక్షులేనట. బెట్టింగ్ యాప్ కేసులో వాటిని ప్రమోట్ చేసిన ప్రముఖులంతా ఇకపై సాక్షులుగా మారబోతున్నారట. అలా సాక్షులుగా మారితే అలా వచ్చి, ఇలా సాక్ష్యం చెప్పి వెళ్లిపోతారంతే. ఇక సీన్ అంతా బెట్టింగ్ యాప్ కంపెనీలపై నడుస్తుంది. చర్యలన్నీ వారిపైనే ఉండబోతున్నాయట.

తాజాగా యాంకర్ శ్యామల విచారణ ముగించుకుని మీడియాతో మాట్లడుతూ.. బెట్టింగ్ మోసానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఈ మాటల వెనుక పరమార్ధం కూడా అదేనట. అయితే ఇలా బెట్టింగ్ కేసులో సెలబ్రిటీలను సాక్షులుగా మార్చడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ కేసుపై కేఏపాల్ తన స్టైల్‌లో రియాక్టయ్యారు. 72 గంటల్లోపు ఆ సెలబ్రిటీలను అరెస్ట్ చేయకపోతే సుప్రీం కోర్టుకు సైతం వెళ్తానంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసి, 980మంది ప్రాణాలు తీసి, ఇప్పుడు క్షమించండి అంటే కుదరదు. బెట్టింగ్ ప్రమోషన్‌లో సంపాదించిన కోట్ల రూపాయలు ప్రజలకు పంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి సెలబ్రిటీల మెడకు చుట్టుకుందనుకున్న బెట్టింగ్ ప్రమోషన్ కేసులో ఏం జరిగిందో ఏమోకానీ ఫోకస్ ఇప్పుడు సంస్థలపైకి మళ్లింది.