జొమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ అదనపు డబ్బుల కోసం గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని తుకారాంగేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 600గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, ఒక మొబైల్ ఫోన్, 5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు. 


మల్కాజ్‌గిరికి చెందిన చుంచు నితీష్ చంద్ర జొమాటో డెలివరి బాయ్‌గా పని చేస్తున్నాడు. అదనపు డబ్బుల కోసం గంజాయి అమ్మడం మొదలు పెట్టాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. నిఘా పెట్టిన పోలీసులు అతన్ని రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా పెడ్లర్ రాహుల్ ఆదేశాల మేరకు చీత, కలాకన్, స్వీట్ లాంటి కోడ్ భాషలను ఉపయోగించి గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడు. ఇప్పటి వరకు 30మందికి గంజాయిని సరఫరా చేసినట్లు తెలింది. 


నితీష్‌ వద్ద గంజాయిని కొన్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టారు. 30 మందిలో 20మందిని గుర్తించినట్టు తెలిపారు. వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నితీష్ చంద్రను అరెస్టు చేసిన విషయం తెలిసిన వెంటనే  ప్రధాన నిందితుడు రాహుల్ బోనగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని వెల్లడించారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే గాంజాయి సరఫరాకు సంబంధించిన నెట్ వర్క్ ఇంకా పెద్ద ఎత్తున బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. 


విద్యార్థులు, యువత దీనికి ఆకర్షితులై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులకు కూడా మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ పిల్లలు ఏం చేస్తున్నారు... ఎలాంటి వారితో తిరుగుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. 


పదిరోజుల క్రితం హయత్‌నగర్‌లో గంజాయి కలకలం


హైదరాబాద్ శివారులో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గంజాయి వాడకం కలకలం రేపింది. నగర శివారులోని హయత్‌నగర్‌ మండలం పసుమాముల వద్ద ఓ ఫామ్‌హౌస్‌పై డిసెంబర్‌ 4న రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఫామ్ హౌస్ లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వినియోగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బర్త్ డే పార్టీని భగ్నం చేశారు. పుట్టినరోజు వేడుకల్లో గంజాయి వాడుతూ ఎంజాయ్ చేస్తున్న మొత్తం 30 మంది వరకు యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఓ బీటెక్ కాలేజీ స్టూడెంట్ పుట్టినరోజు వేడుకలకు తోటి బీటెక్ స్టూడెంట్స్ ను ఆహ్వానించినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఆ విద్యార్థుల నుంచి 10 కార్లు, బైకులు, 28 వరకు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పుట్టినరోజు పార్టీ ఎవరిచ్చారు, గంజాయి ఎక్కడి నుంచి తెచ్చారు, పార్టీ నిర్వాహకులు ఎవరు అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 


హైదరాబాద్‌లో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ కేసులు.. 
కర్ణాటక నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఎసోటి ఎల్బీనగర్, సరూర్ నగర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన నివాస్ వెంకట రంగనాథ చారి బంధువులు, ఇద్దరు మణికొండలో నివసించేవారు. 2017లో డిగ్రీ చదివే సమయంలో నివాస్ కు మహమ్మద్ షాద్ పరిచయం అయ్యాడు, బెంగళూరులో నివసించే మహమ్మద్ సార్ సయ్యద్ అమీర్ అనే వ్యక్తి నుండి మాదకద్రవ్యాలు సేకరించి నివాస్ కి పంపించేవాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ ఎల్బీనగర్, సరూర్ నగర్ పోలీసులు కర్మన్ ఘాట్ లోని రంగనాథ చారి ఇంట్లో రైడ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 12 గ్రాముల హీరోయిన్ నాలుగు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. మాదకద్రవ్యాలను తయారు చేయడం కొనుగోలు అమ్మకాలపై ఎన్ డి పి ఎస్ సెక్షన్ 31a ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉందని కావున యువత తప్పుడుదారి ఎంచుకుని జీవితాలు పాడు చేసుకోవద్దని రాచకొండ సిపి మహేష్ భగవత్ కోరారు.