TSRTC to run 5265 special buses:


తెలంగాణలో పెద్ద పండుగ దసరా, బతుకమ్మ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.


ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని TSRTC కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని భావిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ట్వీట్ చేశారు.


హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్- ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్- ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.


ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.


అక్టోబర్ 21 నుంచి 23 వరకు రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ నడపనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరనున్నాయి. ఇందులో ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ అవుతాయని..  మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయని ఎండీ సజ్జనార్ వెల్లడించారు.


గత దసరా కంటే అదనంగా 1000 బస్సులు 
గత దసరాకు టీఎస్ ఆర్టీసీ 4280 ప్రత్యేక బస్సులు నడిపింది. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించారు.  గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం)  బస్సులను అదనంగా నడపాలని సంస్థ నిర్ణయించింది. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచారు. రెగ్యూలర్ సర్వీసుల తరహాలోనే ప్రత్యేక బస్సులకు రెగ్యూలర్ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.