TSRTC Good News: తెలంగాణ ఆర్టీసీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఈ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజెన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకు రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టికెట్ ధరను ఈరోజు నుంచే అందుబాటులోకి తీసుకువచ్చింది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ టీ-24 టికెట్ కు అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి ఇటీవలే తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు రూ.80కే అందిస్తోంది.






అయితే ఈ ధరలు తగ్గించినప్పటి నుంచి టీ-24 టికెట్ ను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోయిందట. ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టీ-24 టికెట్లు అమ్ముడు అవుతున్నాయట. గతంలో రోజుకు 25 వేల మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింత దగ్గర అయ్యేందుకు రూ.80కే టీ-24 టికెట్ ఇవ్వాలని సంస్థ నిర్ణించింది. అలాగే మహిళలు, సీనియర్ సిటిజెన్ల కోసం టీ-6 టికెట్ ను ఇటీవలే ప్రారంభించామని, రూ.50కి ఆ టికెట్ కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. 






అంతేకాదండోయ్ కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ అందుబాటులోకి తెచ్చామని ఆర్టీసీ సంస్థ చెబుతోంది. వారాంతాలు, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకు వచ్చిన టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లు కొనుగోలు చేసి క్షేమంగా, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చని వివరించింది.