తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) చెందిన పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంలో మరింత వేడి రాజుకుంటోంది. విపక్షాలకు చెందిన కొంత మంది కమిషన్ పని తీరును ఎండగడుతున్నారు. ఏకంగా గోడలకు పోస్టర్లు అంటించి మరీ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్ద వివాదాస్పద రీతిలో గోడకు అంటించిన వాల్ పోస్టర్లు వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని ఎద్దేవా చేస్తూ ఆ పోస్టర్లలో ఉంది. నాంపల్లిలో టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలోనే కొంత మంది ‘టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ అని ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.


‘టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్’ ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును అంటూ ఎగతాళి చేస్తూ పలు డిమాండ్లతో ఓయూ జేఏసీ సభ్యులు పోస్టర్లు అతికించారు. ఇది ఉద్యోగ నియామక కార్యాలయం కాదు.. జిరాక్స్ సెంటర్ అని వాల్ పోస్టర్లలో ముద్రించారు.


"ముఖ్యమంత్రి.. మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి.. ప్రశ్నపత్రాల లీకేజీలో మీ కుటుంబ సభ్యుల పాత్రలేదని చెప్పడానికి వెంటనే కేసును సీబీఐకి అప్పగించి టీఎస్పీఎస్సీ బోర్డును, సంబంధిత శాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి. నష్టపోయిన విద్యార్థులకు ఈ నెల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున మళ్లీ పరీక్ష నిర్వహించే వరకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి" అని గోడలకు అతికించిన పోస్టర్లలో డిమాండ్ చేశారు.