‘మంత్రి కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పేరే అరువు పేరు. సొంతంగా ఊరు లేదు. తెలంగాణలో సదువుకుంది లేదు. తెలంగాణతో పేరు బంధం గానీ, పేగు బంధం గానీ లేదు’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ పేరు ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చుకున్నడు. ఆయన గుంటూరు విజ్ఞాన్ లో చదువుకుండు. నీ సదువు గుంటూరు, చేసిన ఉద్యోగం అమెరికాలో అని రేవంత్ అన్నారు. 6 పాయింట్ ఫార్ములా, 610 జీవోను అనుసరించి తెలంగాణలో ఏ హోదాలోనూ కొనసాగడానికి కేటీఆర్ కు సాంకేతికంగా, నైతికంగా అర్హత లేదు. కేసీఆర్ కుమారుడు అనే హోదాలో ఈ రోజు అన్నీ రకాల హోదాలను అనుభవిస్తున్నారు’ అని కేటీఆర్ ను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.  


సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే బిర్లా టెంపుల్ మెట్ల మీద, నాంపల్లి దర్గా దగ్గర బిచ్చమెతుకునే వారు అని కేసీఆర్, కేటీఆర్ ను విమర్శించారు. “కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి త్యాగాల కుటుంబం నుంచి వస్తున్న సోనియా గాంధీ బిడ్డ, బీహెచ్ఈఎల్, ఐడీబీఎల్.. లాంటి అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ని తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీని కలిసి కాళ్ళకు నమస్కరిస్తే నీ పాపాలు కొంత వరకైనా తొలగుతాయి” అని రేవంత్ రెడ్డి సూచించారు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉప్పు పాతరేస్తారు అని హెచ్చరించారు. మొన్న సభల్లో గాడ్సే ఫోటోను ప్రదర్శించారు. అటువంటి వారి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. 


“ఎనిమిదేళ్లు గాడ్సే పార్టీతో అంటకాగారు. రాష్ట్రపతి ఎన్నికలు, నోట్ల రద్దు, జీఎస్టీ, సీఏఏ వంటి వందల బిల్లులు లోకసభలో, రాజ్యసభలో పాస్ అవ్వడానికి మద్దతిచ్చారు. అటువంటి గాడ్సే పార్టీని మెదక్ పిలుపించుకొని మాకు ఏమి వద్దు మీ ప్రేమ ఉంటే చాలు అని అన్నది కేసీఆర్. కేటీఆర్ తండ్రి. కాంగ్రెస్ పార్టీని, నాయకులను విమర్శించి బతకాలనుకుంటున్నట్లు కేటీఆర్ మాటలను బట్టి అర్ధమవుతుంది” అని రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు గుప్పించారు. 


అభివృద్ధి నమూనాను స్టడీ చేయాలన్నా వ్యాఖ్యాలకు రేవంత్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి నమూనా అంటే ఏంటో చెప్పమన్న రేవంత్ రెడ్డి.. రాష్టంలో జరుగుతున్న అవినీతిని స్టడీ చేయాలా? పేపర్ లీకును స్టడీ చేయాలా?లేదంటే అత్యాచారాలపై స్టడీ చేయాలా అని ఆయన ప్రశ్నించారు. మేము.. 3 వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులను మేం స్టడీ చేయాలా? పంట నష్టం ఇవ్వని రైతుల గోసాను స్టడీ చేయాలా? పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. 12వ తరగతి పరీక్ష పత్రాలు దిద్దితే 25 మంది విద్యార్థులు చనిపోయారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడం చేతకాలేదు. ఈ రోజు టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు సంతలో సరుకుల్లా దొరుకుతున్నాయి. ఈ లీకేజీని స్టడీ చేయాలా? అని రేవంత్ కేటీఆర్ కు చురకలు అంటించారు.
మహారాష్ట్ర నుంచి కిరాయి మనుషులను తెచ్చుకుని సీఎంఓలో ఉద్యోగం ఇచ్చి ఇక్కడి నిరుద్యోగులను కేసీఆర్ అవమానించరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవన్నీ ప్రియాంక గాంధీకి తెలియవా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిందే ఆ కుటుంబం. కేటీఆర్ కు సూచన చేస్తున్నా తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు ప్రియాంక గాంధీ కాళ్లకు నమస్కరించి క్షమాపణ అడగండి. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పుకుంటే  తెలంగాణ సమాజం కనీసం మనుషులుగానైన గుర్తిస్తుంది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.