Telangana Latest Weather Report: క్యూమిలో నింబస్ మేఘాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు దంచికొట్టాయి. ఉదయం నుంచి ఎండ మండిపోయాయి. మధ్యాహ్నం 4 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ఉక్కపోత, వేడితో అల్లాడిపోయిన జనం ఒక్కసారిగా చల్లదనం ఆస్వాధించారు.
మార్చి మూడో వారం నుంచి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఓవైపు భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూనే మరోవైపు వర్షం కూడా అదే స్థాయిలో పడుతోంది. అకాల వర్షాలు వేడి నుంచి కాస్త ఉపశమన కలిగిస్తున్నప్పటికీ రైతులు మాత్రం నష్టపోతున్నారు. గత పదిహేను రోజులుగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసింది. గురువారం చాలా ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో వివిధ జిల్లాల్లో జోరు వాన హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలల్లి, మేడ్చెల్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, మబూబాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి జిల్లాల్లో జోరు వానలు పడ్డాయి. గాలివాన కారణంగా రైతులకు చాలా నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖాధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్లో వర్షం కురిసిన ప్రాంతాలు:-హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి హయత్నగర్ వరకు అన్ని ప్రాంతాల్లో జోరు వాన కమ్మేసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైపోయింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులు ఇబ్బందిపడ్డారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అయింది.
రాష్ట్రంలో గత నెల రోజుల నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అందుకే తెలంగాణ వ్యాప్తంగా క్యూమిలో నింబస్ మేఘాలు కమ్మేసింది. దీని కారణంగానే ఇలాంటి వాతావరణం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి.
ఇలాంటి వాతావరణం మరో రెండు రోజులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం, శివారం కూడా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని చెబుతున్నారు. గాలులు కూడా వీస్తాయని అంటున్నారు. వడగళ్లు కూడా పడతాయని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
