సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి అందులో ముగ్గురు గల్లంతు అయ్యారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారి ఆచూకీ మాత్రం లోపల కనుగొనలేకపోయారు. అయితే, వీరు ముగ్గురు సజీవ దహనం అయినట్లుగా తాజాగా గుర్తించారు. వారి మృత దేహాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరు బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్‌, వసీం, అక్తర్‌ అని గుర్తించారు. ఆచూకీ లభ్యంకాని కూలీల సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ను ట్రేస్ చేయగా వారు మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నట్లు చూపించింది.


తొలుత గల్లంతు అయిన కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు కొనసాగించారు. కూలీల ఆచూకీ కోసం భారీ క్రేన్‌ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. 12 గంటల పాటు విపరీతంగా మండిన మంటల వల్ల భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక భవనం మొత్తాన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు.


మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. భవనంలో 12 గంటలకు పైనే భారీ అగ్నికీలలు ఉన్నాయి. దాంతో లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఎఫ్‌వో ధనుంజయ రెడ్డితో పాటు ఫైరింజన్‌ డ్రైవర్‌ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.


భవనం కూల్చివేసే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది - స్ట్రక్చరల్ ఇంజినీర్


ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీర్ డా. ఎస్పీ ఆచూరి మాట్లాడుతూ ఎటువంటి భవన నిర్మాణానికైనా నిబంధనలు, అనుమతులు, పరిమితులు ఉంటాయని తెలిపారు.. ఈ ప్రమాదం జరిగిన భవనం అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగినట్లు లేదని పేర్కొన్నారు. నిపుణుల సహాయంతో బిల్డింగ్ పరిస్థితి పై సాంకేతిక పరికరాలతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలసిన అవసరముందని అన్నారు.. భవనం కూల్చివేత సమయంలో కూడా నిర్మాణం చేసెప్పటికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడించారు.