TSRTC Gifts:దసరా పండుగ వేళ  తమ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్‌కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. 

Continues below advertisement


ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలంటే ఈ నెల 27నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతోపాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులు. ఈ సర్వీసుల్లో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది. 


ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణనలోకి తీసుకుంటుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అక్టోబర్ 8న అధికారులు ఎంపికచేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తుంది. 



దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.


దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని, ప్రయాణికుల సౌకర్యార్థం 7754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని  బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. 


ఈ మధ్యే తెలంగాణ ఆర్టీసీ  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణ‌యించింది. సంస్ద ఉత్పాదకత పెంపు, సిబ్బంది ప‌నితీరు, ఆరోగ్య స్థితి ప‌ర్య‌వేక్షణ‌, ఖర్చుల తగ్గింపు, ర‌ద్దీకి అనుగుణంగా స‌ర్వీసుల‌ ఏర్పాటు చేయడంతోపాటు సేవలను మరింత మెరుగుపరిచేందుకు తొలిసారిగా ఏఐ వినియోగిస్తోంది.  


ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ అనే సంస్థ టీజీఎస్ఆర్టీసీకి సహకరిస్తోంది. ఏఐ వినియోగం కోసం ఇప్పటికే ఓ ప్ర‌త్యేక టీంను యాజ‌మాన్యం ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారుల‌ను గుర్తించి.. ఆ టీంలో ప్రాధాన్యం ఇచ్చింది. ఏఐ వాడ‌కంపై ఆ టీంకు  హన్స ఈక్విటీ పార్ట్‌న‌ర్స్ శిక్ష‌ణ ఇస్తోంది.  మొద‌ట పైల‌ట్ ప్రాజెక్ట్‌గా ఆరు డిపోల్లో అమ‌లు చేయ‌గా మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమ‌లు చేస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్ చేస్తోంది.