Telangana Rising Summit Film Industry: తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 రెండో రోజు సందర్భంగా “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అనే అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. ప్రముఖ నటులు చిరంజీవి, రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, జెనీలియా దేశ్‌ముఖ్, అక్కినేని అమల, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండే వంటి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.   

స్క్రిప్ట్‌తో వచ్చిన వారు సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రముఖులతో చెప్పారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లో పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశం రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరి పోసేలా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.   

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వినోద రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో రాష్ట్రం సినిమా హబ్‌గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని సీనీ నిపుణులు అభిప్రాయం  వ్యక్తం చేశారు.