Telangana 22A Land Issues:తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రధాన అడ్డంకిగా మారిన నిషేధిత ఆస్తుల జాబితా(22A) సమస్యకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం స్థలాలు, ప్రైవేటు భూములు కలిసి ఉండటం వల్ల తలెత్తుతున్న సాంకేతిక ఇబ్బందులు తొలగించి, అర్హులైన సామాన్య ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పని మొదలు పెట్టింది. 

Continues below advertisement

ఏంటీ 22A సమస్య? ఎందుకు జాప్యం జరుగుతోంది?

రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమితోపాటు ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ఉన్నాయి. గతంలో ఏదైనా సర్వే నంబర్‌లో కొంత భాగం ప్రభుత్వం భూమి ఉంటే, ఆ సర్‌వే నంబర్ మొత్తాన్ని నిషేధిత జాబితా(22A)లో చేర్చేవారు. దీని వల్ల ఆ సర్వే నంబర్‌ పరిధిలో ఉన్న ప్లాట్లు లేదా ఇళ్లు కొన్న సామాన్య ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోవాలన్నా, వేరొకరికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలన్నా రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్‌- మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేంటి?

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సబ్‌రిజిస్ట్రార్‌తో సమీక్ష నిర్వహించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. సర్వే నంబర్‌లలోని ప్రభుత్వ భూమిని , ప్రైవేటు భూమిని వేరు చేస్తూ బై నెంబర్లు ఇవ్వడం ద్వారా స్పష్టత తీసుకురావాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రభుత్వం భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటుంది. మిగిలిన ప్రైవేటు భూమికి రిజిస్ట్రేషన్‌ మార్గం సుగమం అవుతుంది. 

Continues below advertisement

22ఎ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వచ్చే దరఖాస్తులను కేవలం మూడు రోజుల్లోనే పరిశీలించి, అవి పరిష్కారానికి అర్హమైనవా కావా అని తేల్చాలని స్పష్టం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన అన్ని జీవోలు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే - అవుట్‌ అనుమతులను ఆగస్టు 14వ తేదీలోగా ఆన్‌లైన‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఇకపై పీఓపీ దరఖాస్తులను తహశీల్దార్లకు పంపకుండా, నేరుగా కలెక్టర్లకే పంపాలని స్పష్టం చేశారు. తద్వారా నిర్ణయ ప్రక్రియ వేగవంతం అవుతుందని అన్నారు. 

జిల్లాల వారీగా పరిస్థితి 

ప్రస్తుతం ప్రభుత్వానికి అంది 950 దరఖాస్తుల్లో అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా నుంచి 575 వినతులు వచ్చాయి. వీటిలో ప్రాథమికంగా 300 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కూడా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. హెచ్‌ఎండీఏ లే-అవుట్లు, ప్రభుత్వ వేలం వేసిన భూములు కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల 22Aజాబితాలో చిక్కుకుపోయాయి. వీటికి కూడా మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 

గతంలో జీవో 59, 166 వంటి వాటి ద్వారా ప్రభుత్వం భూముల్లోని నివాసాలను క్రమబద్ధీకరించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లను అప్‌డేట్ చేయకపోవడంతో అవి ఇంకా ప్రభుత్వం భూములుగానే చూపిస్తున్నాయి. సబ్‌రిజిస్ట్రార్‌లు డాక్యుమెంట్‌లను క్షుణ్ణంగా పరిశీలించకుండానే, సర్వే నంబర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నారు. ఇకపై ఆన్‌లైన్ డేటా ఆధారంగా మాత్రమే సబ్‌రిజిస్ట్రార్లు పనిచేయాలని, వారికి అదనపు అధికారాలు ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

22A సమస్యల పరిష్కారంపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. సబ్‌రిజిస్ట్రార్‌లకు కూడా పహానీలను చూసే విధంగా ఆన్‌లైన్‌ వ్యవస్థలో మార్పులు చేస్తున్నారు. 

ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో రాజీ పడబోమని చెప్పిన మంత్రి పొంగులేటి, అమాయక ప్రజలు తమ సొంత ఆస్తుల విషయంలో ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పు చేసినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.