అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నటు సీఎం కేసీఆర్ పరిస్థితి ఉందని విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల చెమట, రక్తం, కష్టార్జితాన్ని దేశమంతా తిరిగి పప్పుబెల్లాలు పంచినట్టు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ప్రజల కట్టిన పన్నుల సొమ్మును అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు పంచుతున్నారన్నారు. అమర జవాన్లు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వారి త్యాగం పట్ల, వారి మరణం పట్ల కాంగ్రెస్‌కి సానుభూతి ఉందన్నారు. ఐతే, ఇట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అన్న తీరుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉండటంపై మాత్రమే అభ్యంతరాన్ని తెలియజేస్తున్నామన్నారు. 


బిహార్ రాష్ట్రంలో పర్యటించి గాల్వన్ లోయ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ తరఫున పరిహారం అందజేయడంలో సానుభూతి కంటే రాజకీయ, రాజ్యాధికార విస్తరణ కాంక్షే అధికంగా కనిపిస్తోందని విమర్శించారు రేవంత్. దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఉద్ధరించాలని ఇటీవల ఉవ్విళ్లూరుతున్నారని ఆరోపించారు. అందుకే పప్పుబెల్లాల పంపక కార్యక్రమాన్ని చేపట్టారని చిన్న పిల్లవాడికి కూడా అర్థమవుతోందన్నారు. అమర జవాన్ల మరణాలను సైతం కేసీఆర్‌ తన స్వార్థ రాజకీయాలకు వాడుకునే ఎత్తుగడ చూసి తెలంగాణ సమాజం విస్తుపోతోందని ఎద్దేవా చేశారు. 


నిజంగా అమర జవాన్ల కుటుంబాల పట్ల కేసీఆర్‌కు సానుభూతి ఉంటే... తెలంగాణకు చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాకుల యాదయ్య కుటుంబం కనిపించలేదా? అని రేవంత్ ప్రశ్నించారు. యాదయ్య త్యాగం యాదికి రాలేదా!? అని నిలదీారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డి పల్లెకు చెందిన యాదయ్య కాశ్మీర్‌లో 2013లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని గుర్తు చేశారు. ఆయన కుటుంబాన్ని అప్పట్లో అన్ని పార్టీలు పరామర్శించాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కవిత స్వయంగా వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. ఆ కుటుంబానికి ఐదెకరాలు భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా... ఆ హామీకి అతీగతీ లేదన్నారు. 


తెలంగాణ బిడ్డ అమరుడై, ఆయన కుటుంబం దిక్కులేనిదై రోడ్డున పడితే పట్టించుకోని కేసీఆర్‌... ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బిహార్ రాష్ట్రంలోని అమర జవాన్లకు పరిహారం ఇవ్వడం పరిహాసంగా అనిపించడం లేదా? అని నిలదీశారు రేవంత్. ఇదేనా అమర జవాన్ల కుటుంబాల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి? అని అన్నారు. 


రాజకీయ స్వార్థం కోసం మరీ ఇంతగా దిగజారకండని కేసీఆర్‌కు సూచించారు రేవంత్. ఇప్పటికైనా స్వార్థపూరిత విషపు ఆలోచనలకు కొంత విరామం ఇచ్చి... దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆ కుటుంబానికి ఐదెకరాలు వ్యవసాయ భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. యాదయ్య పిల్లలకు మంచి చదువులు చెప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్.