Telangana Jagruthi: మహిళా కమిషన్ ఆఫీసు వద్ద తెలంగాణ జాగృతి ఆందోళన, తీన్మార్ మల్లన్నపై చర్యలకు డిమాండ్
MLC Teenmar Mallanna | మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

BRS MLC Kavitha | హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేయడానికి వస్తే చైర్ పర్సర్ అందుబాటులో లేకపోవడంతో వారు నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై, మహిళా లోకంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదు తీసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని మహిళా కమిషన్ ఆఫీసు ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లా అండ్ ఆర్డర్ ఐజీ రమణ కుమార్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.
తీన్మార్ మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు ఫిర్యాదు చేశారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమ, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు లేఖ ఇచ్చారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్ బీ నగర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద తెలంగాణ జాగృతి, వివిధ కుల సంఘాల నాయకుల నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్నపై ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి..
మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీసుకు వెళ్లి ఆదివారం నాడు తెలంగాణ జాగృతి నేతలు, కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్సీ కవిత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీసులో దాడులు చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. గన్ మెన్ వద్ద తుపాకీ లాక్కుని కాల్పులు జరపడానికి కార్యకర్తలు యత్నించగా.. వెంటనే వారి వద్ద నుంచి తుపాకీ లాక్కుని తీన్మాన్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆగ్రహం వచ్చి ఆఫీసు వద్ద నిరసన తెలిపడానికి వెళ్తే తెలంగాణ జాగృతి నాయకులపై కాల్పులు జరపడం ఏంటని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి కార్యకర్తలు జరిపిన దాడిలో తీన్మార్ మల్లన్న చేతికి స్వల్ప గాయమైంది. కేసీఆర్, కేటీఆర్ మీద ఫ్రస్టేషన్ ఉంటే వారితో తేల్చుకోవాలి కానీ తన మీద దాడులకు రావడం సరికాదన్నారు. తాను చేసిన కంచం, మంచం వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. అవి తెలంగాణలో రెగ్యూలర్ గా ఉపయోగించే పదాలే అని తన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు.






















