ShivaBalakrishna Corruption Cases : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్​ అయినా రెరా (Rera) కార్యదర్శి శివ బాలకృష్ణ (ShivaBalakrishna) అవినీతి వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ అథారిటీ (Hmda) డైరెక్టర్‌గా పని చేసిన శివ బాలకృష్ణ.... 6 నెలల క్రితమే రెరాకు బదిలీపై వెళ్లారు. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణపై ఏసీబీ (Acb)సోదాలు నిర్వహించింది.


కోట్ల రూపాయలను ఆస్తులను గుర్తించిన ఏసీబీ...శివబాలకృష్ణను అరెస్ట్ చేసింది. ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన భూముల వ్యవహారాలపై దృష్టి సారించింది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై ఫైళ్లను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్దఎత్తున భూములు బదిలీ అయ్యాయి. ఆ ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్‌ఎండీఏలో, పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. 


అక్రమాలకు అడ్డాగా కార్యాలయం


తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ...చ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తన కార్యాలయాన్ని అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ దళారి ఆయనకు కుడిభుజంగా వ్యవరించినట్లు తెలుస్తోంది. ఏ ఫైళ్ల మీద సంతకం పెట్టాలన్నా దళారి మాటే చెల్లుబాటు అయ్యేదని సమాచారం. హైదరాబాద్‌ శివారుకు చెందిన తన మిత్రుడిని, కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని బినామీలుగా మార్చుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వారి పేర్లతోనే   శివ బాలకృష్ణ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తేల్చారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ వస్తుందనే తెలియగానే ఆగమేఘాల మీద  హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు పూర్తి చేసి...కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ నుంచి రెరాకు బదిలీ అయ్యే సమయంలో ప్రధాన ఫైళ్లన్నీ...తన వెంట తీసుకెళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ ఫైళ్లతోనే బేరసారాలు సాగించి...కోట్ల రూపాయలు వెనకేసున్నారు. 


ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న శివబాలకృష్ణ బాధితులు


శివబాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ సర్వే నెంబర్ 446లోని భూమి కోర్టు పరిధిలో ఉంది. అయితే వాటికి అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలకృష్ణ గతంలో అనేక సార్లు బెదిరించారని సూర్యప్రకాశ్ అనే బాధితుడు తెలిపారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు జీవో నెంబర్‌ 111 పరిధిలోని వట్టినాగులపల్లిలో కోట్లు విలువ చేసే స్థలాలకు భూవినియోగ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై దృష్టి పెట్టిన సర్కార్‌ శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలను పరిశీలించాలని భావిస్తోంది.


రెండేళ్ల క్రితం శివబాలకృష్ణపై భారీగా ఫిర్యాదులు 


రెండేళ్ల క్రితం శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ అధికారులు దాడులు చేసేందుకు రెడీ అయిన్పప్పటికీ...అప్పట్లో ఆయన ఉన్నతస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో దాడులకు ఏసీబీ వెనుకాడింది. శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్‌పైనా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో 4 జోన్లు ఉంటే మెజార్టీ జోన్లు శివబాలకృష్ణ చూసేవారు. ఈ జోన్ల కేటాయింపుతో పలువురికి విస్తృత ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది. శివబాలకృష్ణ పర్యవేక్షణలో ఉన్న జోన్లలో సింహభాగం ప్రస్తుతం విలువైన ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ ఎకరం రూ.పదుల కోట్లలో పలుకుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులే కాదు లే అవుట్లకు ఆమోదంలోనూ శివబాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.