Telangana News: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకా రేపాయి. కేటీఆర్‌కు సబితా ఇంద్రారెడ్డి ప్రాంప్టింగ్‌ చేస్తుంటే రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. వెనుక నుంచి మాటలు చెప్పే అక్కలను నమ్మితే కష్టమని రేవంత్ అన్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. 


పద్దులపై చర్చల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ... హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభఉత్వాన్ని నిలదీస్తామని హెచ్చిరించారు. తన ప్రసంగం ముంగింపు టైంలో కళాజీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... ప్రతిపక్షాలు సభకే రావడం లేదని ఇంకా తాము చేస్తున్న అభివృద్ధి పనులకు ఎక్కడ వస్తారని ఎద్దేవా చేశారు. ఇంతలో సబితా ఇంద్రారెడ్డి ఏదో కామెంట్ చేస్తే... " వెనకాల ఉంటే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి  చెప్పి ముంచే అక్కడకు తేలారని ఆ అక్కల మాటలు విన్నారనుకో... జూబ్లీ బస్టాండ్‌లో కూర్చోవాల్సి వస్తుందని విమర్శించారు. మైనార్టీకి మంత్రిపదవి ఇవ్వలేదన్న కేటీఆర్ మొదటి విడత బీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క మహిళకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. 


ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ పదే పదే ఇది మంచి పద్దతి కాదని చెబుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు వినిపించుకోలేదు. ఇంతలో మంత్రి శ్రీధర్ బాబు కలుగుజేసుకొని... ఎవరి పేర్లు చెప్పకుండానే కామెంట్స్ చేశారని వెనుకాల ఉన్న వాళ్లు అంటే సభ బయట కూడా ఉండేవాళ్లు కూడా కావచ్చని అన్నారు. అనవసరంగా మహిళా సభ్యులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రేపు పేపర్లలో పడాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 


తర్వాత మాట్లాడిన సీతక్క... గవర్నర్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నేతలు ఓ వినతి పత్రం ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేసేలా చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఆ వినతి పత్రాన్ని అప్పట్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో  చేరిన ఎమ్మెల్యే ద్వారా ఇప్పించారని సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డితో మేము ఉన్నామని చెప్పి మోసం చేశారనే బాధతోనే అలా మాట్లాడారని అన్నారు. అందుకే కేటీఆర్‌కు సూచనలు చేశారని తెలిపారు. ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ల గొప్ప... అదే ఇప్పుడు జరిగితే తప్పా అని ప్రశ్నించారు సీతక్క. కాంగ్రెస్‌లో మంత్రిపదవులు అనుభవించి... ఆ పార్టీ విధివిధానాలు తెలిసి కూడా ఇప్పుడు విమర్శలు చేస్తుంటే చప్పట్లు కొట్టడమేంటని ప్రశ్నించారు. ఒక పార్టీలో ఉన్న తాము మంచీ, చెడుకు తమదే బాధ్యతగా ఒప్పుకున్నామని అన్నారు. 


ఇంతలో బీఆర్ఎస్‌ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డికి సభాపతి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆమె మాట్లాడుతు.... తనను టార్గెట్‌ ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. అక్కా అక్కా అంటూనే తనను ఎందుకు టార్గెట్ చేసుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంతో ప్రేమతో తాను అప్పుడు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని అన్నారు. కచ్చితంగా మంచి ఉన్నత పదవులకు వెళ్తావని ఆశీర్వదించానని అన్నారు.  అలాంటి నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని ఏం ముంచామని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశాకిరణం అవుతావని ఆహ్వానించామో లేదో గుండెలపై చేయి వేసుకొని చెప్పాలన్నారు.  


అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.... సబితా ఇంద్రారెడ్డి తమ వ్యక్తిగత సంభాషణలు బయట పెట్టారని దానికి కొనసాగింపుగా తాను కూడా కొన్ని విషయాలు వెల్లడిస్తారనని చెప్పారు. పార్టీకీ, తనకు భవిష్యత్‌ ఉంటుందని ఆమె చెప్పారని... దాని తర్వాత జరిగిన ఘటనలు కూడా వివరించాల్సి ఉందన్నారు. తాను కొడంగల్‌లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయామని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పింది. దీంతో సబితా ఇంద్రారెడ్డి తనతో మాట్లాడుతూ మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని సూచించారు. ఆ తర్వాత అధిష్ఠానం టికెట్ ఇచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. తమ్ముడిగా నన్ను పిలిచి ఎంపీగా పోటీ చేయమని చెప్పి... కేసీఆర్‌ మాయమాటలకు పడిపోయి కాంగ్రెస్‌కు ద్రోహం చేసి మంత్రి పదవి కోసం వెళ్లిపోయారు అన్నారు. అది గుర్తుపెట్టుకొని వారి మాటలు నమ్మొద్దని కేటీఆర్‌కు చెప్పాను అన్నారు. ఇది నిజమా కాదా అనేది సబితా ఇంద్రారెడ్డి చెప్పాలని సవాల్ చేశారు. ఆమె పేరు తీసుకోకపోయనా ఆమెకు మాట్లాడే అవకాశం ఇచ్చారు అన్నారు.