కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు ఆ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అనుకోవాలా, లేక కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెటా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కేంద్రం బడ్జెట్ లో ఏమీ ఇవ్వలేదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సబ్ కా సాత్ సబ్ కా వికాన్ అని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం నిధులను ఎందుకు రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 
తెలంగాణకు ఒక్క మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు
119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్ లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా తెలంగాణకు రాదని స్పష్టం చేశారు కవిత. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాంపును పొడిగించినప్పుడు మరి తెలంగాణలోని నిమ్స్, ఇతర సెజ్ ల పరిస్థితి ఏమిటని జాతీయ మీడియా ఏఎన్ఐ తో మాట్లాడుతూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కేవలం కొన్ని రాష్ట్రాల వైపే ఎందుకు చూస్తుంది. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ట్రాల బడ్జెట్ మాత్రమేనా అని నిలదీశారు. 
నీతి ఆయోగ్ సిఫారసు చేసినా ఒక్క రూపాయీ ఇవ్వలేదు
కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ. 5,300 కోట్లు కేటాయించినందుకు సంతోషంగా ఉందన్నారు. కానీ తెలంగాణకు చెందిన కాళేశ్వరం, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసిననప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని కవిత మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి గమనిస్తే.. ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం అవుతుందన్నారు కవిత. దేశ ఆర్థిక వృద్ధిని నిర్ధేశించని బడ్జెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. బడ్జెట్ ను ప్రధాని నరేంద్ర మోదీ అంకెల గారడిగా అభివర్ణించారు. కరోనా సమయంలో ఎంఎస్ఎంఈలకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.


ఎయిర్పోర్టుల వంటి ప్రాజెక్టుకు ప్రకటించినా అవన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు, బీజేపీ పాలిత రాష్ట్రాలకే మంజూరు చేస్తారని తెలిపారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, గత 9 ఏళ్లుగా కోరుతున్నా.... కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు కవిత. ఏయే రాష్ట్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తరో జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్రం... వాటిని ఏ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. కేవలం వారి కార్పొరేట్ మిత్రులకే వెళ్తాయా ఈ నిధులు అని అడిగారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత.