హైదరాబాద్‌లో జరిగిన కోడిపందాల కేసులో చింతమనేని మరోసారి స్పందించారు. కేసు నమోదైనప్పుడు తొలిసారిగా ఫేస్‌బుక్‌ స్పందించిన చింతమనేని... లేని వ్యక్తిని కేసుల్లో ఎలా బుక్‌చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాయంత్రానికి చింతమనేని ఉన్నారంటూ.. వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో మరోసారి వీడియో రిలీజ్ చేశారు. కర్ణాటకలో జరిగిన కోడి పందాల్లో పాల్గొన్నానని.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌ వెళ్లినట్టు చెప్పారు. పటాన్ చెరులోని ఓ వ్యక్తి ఇంటికి భోజనానికి వెళ్లాలని వివరించారు. హైదరాబాద్‌లో కోడిపందాలు జరుగుతున్నట్టు అక్కడే తనకు తెలిసిందన్నారు. అది తెలుసుకొని అక్కడికి వెళ్లానన్నారు. 


హైదరాబాద్‌లో కోడిపందాలు చూడటానికే వెళ్లాను తప్ప పందాలు నిర్వహించలేదన్నారు చింతమనేని. కోడిపందాలు నిర్వహించింది తానే అని చెప్పడం సరికాదన్నారు. తనకు ముందుగానే పోలీసుల నుంచి సమాచారం వచ్చిందని.. అందుకే అక్కడి నుంచి తప్పించుకున్నట్టు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. తెలంగాణ పోలీసులు నుంచి తనకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని తెలిపారు. కోడి పందాల్లో ఉన్న సందర్భంలో అక్కడ కొంత మంది పోలీసులు వస్తున్నారని మాత్రం తెలిసిందని వివరించారు. ఆ విషయం తెలిసే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. 


నిన్న ఫేస్‌బుక్‌ వేదికగా తనపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు చింతమనేని. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ప్రశ్నించారు. కోడిపందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపిస్తున్నారని ఆరోపించారు. నీచమైన ప్రచారంతో కుప్పకూలే మేడలు కట్టి కొంత మంది అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మీ మేడ కూలిపోయే సమయం అసన్నమైందని చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు.


‘‘కోడి పందాల్లో లేని వ్యక్తి నీ ఉన్నట్లు గానే చూపటం మీ జెండా అజెండా ఇంత రాక్షస రాజకీయం అవసరమా...? రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొండి. ఈ దుర్మార్గపు నీచమైన ప్రచారం ఇకనైన ఆపండి. ఈ నీచమైన ప్రచారం తోనే కుప్ప కూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటి నాడు అధికారంలోకి వచ్చారు. ఆ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయింది. మీ అసత్యాలు సాక్షి నీ ప్రజలు కూకటి వేళ్లతో ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమయింది. ఆ రోజు కొసమే తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ రాక్షస రాజకీయ వికట ఆట్టహాసానికి ముగింపు త్వరలోనే.’’ అని చింతమనేని ప్రభాకర్ తన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు.


సాయంత్రానికి ఇదిగో చింతమనేని ప్రభాకర్‌ అంటూ వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో మరోసారి ఆయన వివరణ ఇచ్చారు. అసలు ఆ ప్రాంతానికే వెళ్లలేదన్న వ్యక్తి... వెళ్లాను కానీ పందాలు వేయలేదు... ఆడలేదంటూ వివరణ ఇచ్చారు. 


హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మాజీ టీడీపీ ఎమ్మేల్యే, ఏపీకి చెందిన చింతమనేని ప్రభాకర్ సహా పలువురు వీఐపీలు దీనికి వెనక ప్రధాన సూత్రధారులని పోలీసులు భావిస్తున్నారు. ఈ కోడి పందాల నేపథ్యంలో లక్షల్లో బెట్టింగ్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ శిబిరంపై దాడులు చేసిన పోలీసులు 21 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు తప్పించుకోగా, వారి కోసం గాలిస్తున్నారు. 


పోలీసులను చూసి చింతమనేని ప్రభాకర్ పరార్ అయినట్లుగా తెలుస్తోంది. పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరు సమీపంలో చిన్న కంజర్ల గ్రామంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. వారి నుంచి రూ.13,12,140 నగదు స్వాధీనం చేసుకున్నారు. 26 వాహనాలు, 32 పందెం కోళ్లు, 30 కోడి కత్తులు, 27 సెల్ ఫోన్లు ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కోడి పందాల్లో మొత్తం 70 మంది బెట్టింగ్ రాయుళ్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది.


49 మంది పరారీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని పోలీసులు భావిస్తున్నారు. మరో ముగ్గురు నిర్వహకులు అక్కినేని సతీష్, కృష్ణంరాజు, బర్ల శ్రీను పాత్ర కూడా ఉందని పోలీసులు తేల్చారు. పోలీసుల అదుపులో సతీష్, బర్ల శ్రీను ఉండగా, చింతమనేని సహా కృష్ణంరాజు అనే వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.