చలిగాలులు కారణంగా తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతున్నా... ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. తెలంగాణలో హీట్ రోజురోజుకు రాజకీయ నాయకులే పెంచేస్తున్నారు. మొన్నటి వరకు ఎక్కువగా మేల్ పోలిటీషియన్స్‌ మాత్రమే వార్‌లో ముందుండే వాళ్లు. మాటకు మాట చెబుతూ రాజకీయాలను రక్తికట్టించేవాళ్లు. ఇప్పుడు సీన్‌లోకి ఎమ్మెల్సీ కవిత, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎంట్రీ ఇచ్చారు. మొన్నటికి మొన్న ట్విటర్‌లో ఇద్దరి మధ్య కవితల వార్‌ నడిచింది. దీనికి ముగింపు రాజ్ భవన్‌లో పడింది. 


గత కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ గవర్నర్‌ వార్‌ ఉంటే ఇప్పుడు కొత్తగా వైఎస్‌ఆర్‌టీపీ కూడా వచ్చి చేరింది. గులాబీ శ్రేణులే నిన్నటి వరకు వారియర్స్‌గా ఉంటే ఇప్పుడు కవిత నాయకత్వంలో వార్ పతాకస్థాయికి చేరింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, విపక్ష బీజేపీ మధ్యే ఫైట్‌ వేరలెవల్లో ఉండేది. ఇప్పుడు ఆ ఫైట్‌లోకి వైఎస్‌ఆర్‌టీపీ కూడా ఎంట్రీ ఇచ్చి దాన్ని ట్రయాంగిల్‌ ఫైట్‌గా మార్చారు. 


పాదయాత్రలో జరిగిన దాడులను ఎత్తి చూపుతూ వైఎస్ షర్మిల మొదలెట్టిన నిరసన అరెస్ట్‌ల వరకు వెళ్లింది. రాజ్‌ భవన్‌ గడప ఎక్కింది. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలిపై అధికారపార్టీ నేతలు విమర్శలు చేశారు. ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా అని కడిగేశారు. కెసిఆర్‌పై, మంత్రులు, గులాబీ నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నల్లిని నలిపేసినట్లు నలిపేస్తామని చెప్పడమే కాదు తలచుకుంటే లోటస్‌ పాండ్‌ నుంచి అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డవి కానప్పుడు, తెలంగాణకి వ్యతిరేకంగా పని చేసిన కుటుంబానికి చెందిన వ్యక్తివి కాబట్టి ప్రశ్నించే హక్కులేదన్నట్లు టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడారు. 


అధికారపార్టీ నేతలు ఇలా మాట్లాడటం కొత్త కాదు. ఇంతకుముందు గవర్నర్‌ విషయంలో కూడా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే ఎక్కువగా స్పందించారు. తమిళిసై విమర్శలు, ఆరోపణలకు తమదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఎంతలా అంటే బాడీషేమింగ్‌తో బాధపెట్టారని ఓ మీడియా ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ ఆడపడచునని చెప్పిన కెసిఆర్‌ ఇలా చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. షర్మిల కూడా టీఆర్‌ఎస్‌ నేతల వార్నింగ్‌లకు భయపడేది లేదని చెబుతూనే కెసిఆర్‌ బూతుల చరిత్ర చూడండని ఓ వీడియోని మీడియా ముందుంచారు. 


మగాడివా అని ఏ టీఆర్‌ఎస్‌ నేతనీ విమర్శించలేదని... ఆ అవసరం లేదంటూనే ఆయన మగతనం గురించి వాళ్ల ఆవిడ చెప్పాలని ఘాటుగా బదులిచ్చారు షర్మిల. తాను పులివెందుల బిడ్డనైతే కెటిఆర్‌ భార్య ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేతలతోపాటు ఎమ్మెల్సీ కవితని కూడా ప్రశ్నించారు. ఆడబిడ్డ అని పుట్టగానే ఎందుకు అంటారో వివరిస్తూనే తనది తెలంగాణనే అని మరోసారి గుర్తు చేశారు.


వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలి విషయంలో ఈసారి కెసిఆర్‌ ఫ్యామిలీ నుంచి కవిత విమర్శలకు దిగడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితల ట్వీట్లపై షర్మిలమ్మ కూడా సెటైరికల్‌ గానే బదులిచ్చారు. లిక్కర్‌ స్కాంలో కవిత పేరు ఉండటంపై స్పందిస్తూ అక్కడే ట్వీట్లు చేసుకుంటూ కూర్చొవచ్చని ఎద్దేవా చేశారు షర్మిల. కవిత, షర్మిల వార్‌కి బ్రేక్‌ పడకముందే విషయం రాజ్‌ భవన్‌కి చేరడంతో ఇప్పుడు తమిళిసై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇంట్రస్టింగ్‌ గా మారింది.