Telangana Lates News: రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రోటోకాల్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. 


నియోజకవర్గంలోని మున్సురాబాద్‌ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక కార్పొరేటర్‌ను పిలవకుండా కార్యక్రమం చేపట్టడంపై ఆ స్థానంలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలువకుండా ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. 


విమర్శలతో ఆగిపోని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన్ని వారి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 


శంకుస్థాపన ఏరియాలో బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 


స్టేషన్‌లో తన అనుచరులు ఉన్నారని తెలుసుకున్న సుధీర్ రెడ్డి హుటాహుటిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అరెస్టు అయ్యి స్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులను పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ఆయనపై విమర్సలకు కారణమయ్యాయి. 


స్టేషన్‌లో ఉన్న అనుచరులతో సమావేశమై వచ్చిన సుధీర్ రెడ్డి... కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ రెడ్డి తనను దూషించారని ఎల్పీనగర్ పీఎస్‌లో బానోతు సుజాత ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. దీన్ని న్యాయస్థానంలో ఎదుర్కుంటానని అన్నారు. కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడబలుక్కుని తనపై అక్రమ కేసు బనాయించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అక్రమ సంబంధాన్ని ఎండగడుతూనే ఉంటామన్నారు.