Work on Santosh Nagar Steel Bridge is going on in a very dangerous manner:  హదరాబాద్ నగరంలోని సంతోష్ నగర్ వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలేదు. గిర్డర్ల ఏర్పాటు సమయంలో కార్మికులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో కింద వాహనాల రాపోకల్ని కూడా ఆపలేదు. 

నిర్మాణ స్థలంలో కార్మికులు కనీసం రక్షణ బెల్టులు , హెల్మెట్లు కూడా లేకుండా గిర్డర్లపై నడుస్తున్న తీరు అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తున్నారు.  ఒకవేళ పొరపాటున గిర్డర్లు జారినా లేదా కార్మికులు కాలు జారినా జరిగే ప్రాణనష్టం జరుగుతుంది. ఇంతటి భారీ నిర్మాణ పనుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం అధికారుల వైఫల్యమేనని  విమర్శలు వస్తున్నాయి.   

దీనిపై కేటీఆర్ స్పందించారు.  కార్మికులు , వాహనదారుల ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్న సదరు నిర్మాణ సంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ సంస్థను వెంటనే  బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ బృందాన్ని బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పనుల పేరుతో సామాన్యుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టడం సరికాదని హితవు పలికారు.

సంతోష్ నగర్ వంటి రద్దీ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న సమయంలో కింద వాహనాలు వెళ్తుంటాయి. పైన గిర్డర్ల అమరికలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్‌తో స్పందించిన అధికారులు, తక్షణమే నిర్మాణ ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది.