Center Gives Green Signal for Warangal Airport | హైదరాబాద్: వరంగల్ లోని మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమికి సేకరించి ఇస్తే, పనులు ప్రారంభం అవుతాయి. మామునూరు ఎయిర్ పోర్టు సంబంధించి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి సమీక్ష నిర్వహించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

కొచ్చి ఎయిర్ పోర్ట్ తరహాలో వరంగల్ ఎయిర్ పోర్ట్

భూసేకరణ పూర్తిచేసి వీలయినంత త్వరగా డిజైనింగ్ కు పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు వద్ద నిత్యం యాక్టివిటీ ఉండేలా డిజైన్ చేయాలన్నారు. విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ ఉండేలా, వరంగల్ నగరానికి తలమానికంగా మామునూరు విమానాశ్రయ నిర్మాణం ఉండేలా చూడాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి, ప్రతినెలా తనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించాలని అధికారులను ఆదేశించారు. 

సీఎం రేవంత్ రెడ్డికి వరంగల్ నేతలు ధన్యవాదాలు

ఈ సందర్భంగా మామునూరు విమానాశ్రయానికి (Mamnoor Airport) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read: Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు 

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ - సీఎం రేవంత్ రెడ్డిరాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా(ATC) అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కార్మిక శాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఏటీసీ ఉండాల్సిందే అన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో లేదా పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలన్నారు.

ఏటీసీలలో అవసరమైన సిబ్బంది ఇతర వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. సిబ్బంది నియామకంపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏటీసీల ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించేందుకు ప్రభుత్వంగా సిద్ధంగా ఉందన్నారు. గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యాక్ట్ పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.