హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం చుట్టూ రాజకీయాలు రోజు రోజుకూ హీటెక్కుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గణేష్ నిమజ్జనం వివాదం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజాగా భజరంగదళ్, హిందూ సంఘాలు, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంగా మారిపోయింది. వీరి మాటల యుద్దం హద్దులు దాటి తారాస్దాయికి చేరుతోంది. ఎంతలా అంటే.. ‘‘అవసమైతే హైదరాబాద్ నగరాన్ని దిగ్భంధిస్తాం. ఎక్కడి విగ్రహాలు అక్కడే రోడ్లపైనే నిలిపివేసి నగరాన్ని స్దంభింపజేస్తా’’మంటూ కేసిఆర్ ప్రభుత్వానికి భాగ్యనగర ఉత్సవ కమిటీ 
డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో అందుకు సై అంటూ సంకేతాలిస్తూ ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీకి పూనుకుంది.


‘‘ప్రభుత్వాన్ని ర్యాలీతో మేలు కొలుపుతాం. ఒకవేళ అప్పటికీ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయకుండా ఆటంకం కలిగించాలని చూస్తే మాత్రం పరిస్దితి వేరే లెవెల్’’ అంటోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి. బీజేపీ మరో అడుగు ముందుకువేసి ప్రగతి భవన్ లోనే నిమజ్జనం రెడీనా అంటోంది.


ఇంతలా ఈసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం రాద్దాంతం అవడానికి కారణాలు అనేకం. భాగ్యనగరంలో వినాయకచవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం చివరి రోజు జరిగే శోభాయాత్రకు ఉన్న క్రేజే వేరు. హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర చూసేందుకు హైదరాబాద్ చుట్టుప్రక్కల జిల్లాల నుండి మాత్రమేకాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తుంటారు. అంతలా ప్రాధాన్యం ఉన్న గణేష్ నిమజ్జనాలు ఈ ఏడాది వివాదాలకు కేంద్రంగా మారాయి. ఈ ఏడాది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొంభై వేలకు పైగా చిన్నా పెద్దా గణేష్ మండపాలు  వెలిశాయి. అంటే ఎనభై వేలకుపైగా గణేష్ విగ్రహాలు చివరి రోజు నిమజ్జనానికి సిద్దమవుతున్నాయి. చెరువులు, కుంటలు, బేబి పాండ్స్ ఇలా ఎన్ని ఉన్నా.. అందరి చూపు హుస్సేన్ సాగర్ వైపే. కెమెరాల ఫోకస్ సాగర్ లో నిమజ్జన సందడిపైనే. ఇది ప్రతీ ఏటా కొన్ని దశాబ్ధాల  నుండి వస్తున్న సాంప్రదాయం.


హైకోర్టు ఆదేశాల వల్లే


అయితే హుస్సేసాగర్ జలాలు కలుషితమవుతున్నాయనే ఉద్దేశంతో హైకోర్టు, సాగర్ లో పర్యావరణానికి హానికరమైన ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ (పీఓపీ) విగ్రహాలు ఎట్టి పరిస్దితుల్లోనూ నిమజ్జనం చేయొద్దంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రభుత్వానికి నేరుగా వార్నింగ్ ఇచ్చింది.  ఇక్కడే వచ్చింది అస్సలు చిక్కు. ఇప్పటికే నగరంలో ఏర్పాటైన విగ్రహాల్లో పీఓపీ విగ్రహాలే ఎక్కువ. మరి సాగర్ లో నిమజ్జనం వద్దంటే ఎక్కడ ఈ వేలాది విగ్రహాలు నిమజ్జనం చేయబోతున్నారనే ప్రశ్న అందరినీ గత కొద్ది రోజులుగా వెంటాడుతూనే ఉంది. ఆ సందేహాలకు ఆద్యం పోస్తున్నట్లుగా తాజాగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుపై మండిపడింది. నిమజ్జనం సజావుగా జరగనివ్వకుంటే హైదరాబాద్ ను స్తంభింపజేస్తాం అంటూ హెచ్చరించింది.


బీజేపీ సైతం గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మండిపడింది. హిందూ పండుగలపైన మీరు కావాలని ఆంక్షలు పెడుతున్నారు. నిమజ్జనం అడ్డుకోవాలని చూస్తున్నారు. ఆగమేఘాల మీద మంత్రులతో రివ్వూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మైక్ లు పెట్టొద్దు. సాగర్ లో విగ్రహాల నిమజ్జనం పై ఆంక్షలు విధించారు.


‘‘వెంటనే ప్రభుత్వ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సజావుగా సాగనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తే సహించం. నిమజ్జనం కోసం వచ్చే విగ్రహాలను నేరుగా ప్రగతి భవన్ కు తీసుకొస్తాం. సాగర్ లో కాదు ప్రగతి భవన్ లో ఈసారి గణేష్ నిమజ్జనం చేస్తాం’’  అంటూ బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 


ఇలా ఓవైపు గణేష్ ఉత్సవ కమిటీ మరో వైపు బీజేపీ కలిసి కేసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేశాయి. స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, నిమజ్జనాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నా’’మంటూనే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తాము హిందువులమే, తమకు తెలుసు ఏలా జరపాలో అని అన్నారు.


ఇలా ఎవరి వాదనలు, విమర్మలు ప్రతివిమర్మలు ఎలా ఉన్నా. ఈ సమస్యకు ఆద్యం పోసింది మాత్రం వ్యవహరిస్తున్న తీరేననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి ఏ మాత్రం అనుమతించవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ నిమజ్జనానికి అవసరమైన బేబి పాండ్స్ ఏర్పాటు చేయడంతోపాటు భాగ్యనగర్ ఉత్సవ కమిటీని సంప్రదించి, నిమజ్జనం సజావుగా జరిగేందుకు అవలంబించాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఉంటే ఈ పరిస్దితి వచ్చేదికాదు.


అలా కాకుండా నిమజ్జనం సమయం సమీపించేవరకూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రాద్దాంతం మొదలైయ్యిందనే వాదనలు విపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ భారీ క్రేన్ లు ప్రతీ ఏటా ఏర్పాటు చేసేవారు. మరీ ఈ ఏడాది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆంక్షలు పెడుతున్నారనేది ఓ వర్గం వాదనైతే, అదేంలేదు ఈసారి కూడా ఎప్పటిలానే నిమజ్జనాలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని అధికార పార్టీ మంత్రులంటున్నారు. ఈ వ్యవహారం సజావుగా ముగుస్తుందా.. లేక జంక్షన్ జామ్ అవుతుందో అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.