Murmu Telangana Visit: మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సంస్కృతిని చూసి గర్వపడాలన్నారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల‌్‌ను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. ఈ క్రమంలోనే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆ తర్వాత ప్రశ్నలు లేవనెత్తిన అంశాలపై స్పందించారు. పెరుగుతున్న యువ జనాభా భారత్ కు మరింత సానుకూలమని అభిప్రాయపడ్డారు. అయితే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం అసలే ఉండకూడదన్నారు. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలను నుంచి వచ్చామని ఏ రోజూ ఫీల్ అవ్వకూడదని సూచించారు. 






మన దేశంలో ప్రతీ ఊరికి గ్రామ దేవత రక్షణగా ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. మహిళలు కూడా అన్ని రంగాల్లో అకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని, తల్లిదండ్రులు చిన్నతనం నుంచే పిల్లలకు విలువల గురించి నేర్పించాలని కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని, భారత్ లో ఉన్న జనాభా అమెరికాలో లేదన్నారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలో లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కేశవ్ మెమోరియల్‌ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.