TPCC Chief Revanth Reddy Comments on Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ లక్ష్యం కోసం ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళారో ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాటల్లో స్పష్టమైందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలన్న రాజేందర్ లక్ష్యంతో బీజేపీలో చేరారని అన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా (చిట్ చాట్) మాట్లాడారు.


‘‘కానీ బీజేపీలోకి వెళ్ళాక ఈటల అర్థమైంది. అక్కడ కూడా కేసీఆర్ కోవర్ట్ లు ఉన్నారు. ఈటల రాజేందర్ లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నాయకులు.. ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల రాజేందర్ మాట్లల్లో స్పష్టమైంది. కాబట్టి ప్రజలు దీనిపై ఆలోచించాలి. కేసీఆర్ కు అంబేడ్కర్ మీద మొదటి నుంచి కక్షే. కేసీఆర్ బర్త్ డే రోజు కాదు, అంబేడ్కర్ బర్త్ డే రోజు కొత్త సచివాలయాన్ని ప్రారంబిస్తే గౌరవంగా ఉండేది.


ఈటల రాజేందర్, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటివారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ ఐడీయాలజీతో ఆ ముగ్గురికి సంబంధం లేదు. బీజేపీలో కూడా కోవర్ట్ లు ఉన్నారని ఈటల అన్నారంటే ఏదో అసంతృప్తి ఉన్నట్లే కాదా? ఈటల ముందుకు రాలేక, వెనక్కి పోలేని స్థితిలో ఉన్నారు.


కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో ఈటల బీజేపీలో చేరినా ఆ లక్ష్యం నెరవేరడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. ఈటల, మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ల దారి వాళ్లు చూసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్లు నమ్మిన సిద్ధాంతంపై నడవాలి. నేను చెప్పిందే రాజేందర్ కూడా చెప్పాడు. హుజూరాబాద్ అయినా మునుగోడు అయినా సందర్భానుసారమే బీజేపీకి ఓట్లు పడ్డాయి. మిగతా సందర్భాలలో బీజేపీకి ఆ ఓట్లు పడవు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు. పార్టీ హైకమాండ్ భట్టికి భాధ్యతలు ఇచ్చింది.


కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తాం. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తాం. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి భాధ్యతలు నిర్వహించగా 21 సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు?


కేసీఆర్ విష ప్రయోగంలో ఈటల కూడా పాత్రధారి అవుతున్నాడు. రాజేందర్ కు ఇష్టం లేని పనులను కేసీఆర్ చేయిస్తున్నారు. ఈటల లెఫ్టిస్టు.. కానీ రైటిస్ట్ పార్టీలోకి పోయేలా చేశాడు. ఈటలకు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదు. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించాడు. కేసీఆర్ అనుకున్నదే రాజేందర్ తో చేయిస్తున్నారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.