తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఎల్లప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుంటారు. సభల్లో తన వ్యాఖ్యలతోనూ, చేష్టలతోనూ విపరీతంగా వైరల్ అవుతుంటారు. ఆ మధ్య తాను ఎదిగిన తీరును వివరిస్తూ.. ‘పాలమ్మినా, పూలమ్మినా, బోర్ వెల్స్ నడిపిచ్చినా, కాలేజీలు పెట్టినా’ అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే మంత్రి మల్లారెడ్డి ఓ సెలబ్రిటీ అయిపోయారు. 


తాజాగా విజయదశమి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. బోయిన్ పల్లిలో విజయదశమి సందర్భంగా మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు కూడా పూజ చేశారు.


దీని మీదే పాలమ్మిన
ఆ స్కూటర్ పై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో ఓ సందర్భంలో పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడినా అంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను పాలమ్మిన ఆ స్కూటర్‌పైనే పూజ చేసి దానిపై చక్కర్లు కొట్టారు మంత్రి.